ఇటీవలే వైసీపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త, జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లోటస్పాండ్లో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు గుర్తుకు వస్తాయి. ఆయా పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎలాగైనా గెలిచి..తర్వాత ఆ పార్టీ బయటకు నెట్టడం బాగా అలవాటని అన్నారు. ఆయన పై ఆయనకే నమ్మకం లేక ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే వారు..రాష్ట్ర భవిష్యతు ఏం కాపాడుతారు..మీ భవిష్యత్ నాది అని ప్రజలకు భరోసా ఇస్తున్నారు..ఆయన భవిష్యత్ పైనే నమ్మకం లేని వారు..చంద్రబాబని ఎద్దేవా చేశారు.
ప్రధాని నరేంద్రమోడీని నాలుగేళ్లు నెత్తిన ఎక్కించుకుని హోదా వద్దు ప్యాకేజ్ ముద్దు అన్నట్లుగా వ్యవహరించారని నార్నే ఆరోపించారు. తీరా ఎన్నికల ముందు ఆ పార్టీతో వైరం పెట్టుకొని రాహూల్ చెంతకు చేరారని అన్నారు. అసలు అమరావతి విషయంలో ఆయన మాటలు, గ్రాఫిక్స్ తప్ప ఏమైనా పనైందా అని విమర్శించారు. అంతే కాదు సొంత సోదరికి తిరుపతిలో ప్రమాదం జరిగితే ఇంతవరకు ఆమెను పరామర్శించలేదంటే చంద్రబాబు ఎలాంటివాడో అర్థమవుతుందని అన్నారు. సొంత చెల్లెల్నే సరిగా చూసుకోలేని చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న చెల్లెమ్మలను ఎలా చూసుకుంటారని మండిపడ్డారు.
చంద్రబాబుకు ఇచ్చినట్లు తనకు కాని మరో బిల్డర్కు కానీ ఇచ్చుంటే ఈపాటికే అమరావతి పూర్తయిపోయి ఉండేదని నార్నే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకో 20 ఏళ్లు చంద్రబాబు అధికారంలో ఉన్నా అమరావతి ఇలాగే ఉంటుందని అందులో ఏ మార్పు రాదని శ్రీనివాసరావు దుయ్యబట్టారు. నారా లోకేష్ టెన్త్ ఎలా పాసయ్యాడో తనకు తెలుసని అన్నారు. లోకేష్ పదో తరగతిలో ఉత్తీర్ణుడు అయ్యేందుకు మంత్రి నారాయణ సహకరించాడని ఆరోపించారు. చంద్రబాబు కాంగ్రెస్ నుంచి వచ్చాడు కాబట్టే ఇప్పుడు టీడీపీని కూడా కాంగ్రెస్ కే తాకట్టు పెట్టాడని విమర్శించారు.