బుద్ధా వెంకన్న గురించి పరిచయం అవసరం లేదు. టీడీపీ నేత అయిన వెంకన్న తనదైన శైలిలో చేసే కామెంట్లు మీడియాలో ప్రత్యేకతను సంతరించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పట్ల కనబర్చిన ప్రత్యేక ప్రేమ కారణంగా ఎమ్మెల్సీ పదవి పొందారనే టాక్ కూడా ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా టీడీపీ పెద్దలను ``హైడ్రాలిక్ జాకీ``తో లేపే వెంకన్న తాజాగా అదే పని చేశారు. ఏపీలో ఎన్నికల ఫలితాల ట్రెండ్ ఒకలా ఉంటే...వెంకన్న మరో జోస్యం చెప్పారు.
పులి వెనుక అడుగువేసిందంటే అది పంజా విసరడానికే.. ఉడత బెదిరింపులకు బెదిరేదిలేదని బుద్దా వెంకన్న సెలవిచ్చారు. తొగడొట్టి చెబుతున్నా.. ఏపీలో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీయే.. మళ్లీ ముఖ్యమంత్రి కాబోయేది చంద్రబాబు నాయుడే అని కూడా ఆయన ప్రకటించేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన నేడు శ్రీరాముడి కళ్యాణం.. మే 23న ఆంధ్ర శ్రీరాముడు చంద్రబాబుకి ప్రజలు పట్టాభిషేకం చేయబోతున్నారని అన్నారు. ప్రజలు ఫలితాలను ఎప్పుడో నిర్ణయించేశారని ప్రకటించారు.
బీజేపీ, వైసీపీలు నాలుగు రోజులుగా చంద్రబాబుపై మైండ్ గేమ్ ఆడుతున్నాయని మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్సీ... దేశానికి శాడిస్ట్ ప్రధానిగా మోడీ ఉండటం ఈవీఎంలపై అనుమానాలకు తావిస్తోందన్నారు. ఎన్నికల రోజు అసలు ఈవీఎంలు ఎందుకు పనిచేయలేదు? దీని వెనుక కుట్ర ఉంది కాబట్టే అలా జరిగిందన్నారు. ఎన్నికల సంఘం వైఫల్యాలపై చంద్రబాబు పోరాటం చేస్తుంటే.. ఓటమి భయం అంటూ వైసీపీ నేతలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలు రాకుండానే వైసీపీ వాళ్లు దాదాగిరి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకన్న.. ఇలాంటి వాళ్లు వస్తే.. ప్రజలు బతకగలరా?... రక్షణ ఉంటుందా? అని ప్రశ్నించారు.