ఎన్నికల ఫలితాల నేపథ్యంలో...అన్ని సర్వేల్లో, రాజకీయ విశ్లేషకుల మాటల్లో వైసీపీ గెలుపు ఖాయమనే ప్రకటనలు వస్తున్న తరుణంలో ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలకు కీలక ఆదేశం ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీతో టచ్లో ఉండాలని చంద్రబాబు ఆదేశించారట. ఈ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ వెల్లడించారు. ఈ మేరకు ఆయన సంచలన ప్రకటన చేశారు.
విజయవాడలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు పదవీవ్యామోహం పోలేదన్నారు. ``చంద్రబాబు కుట్రలను కుతంత్రాలను ఆపకపోతే ప్రజలు తరిమికొడతారు. వ్యవస్దలన్నీ తన చెప్పుచేతుల్లో ఉండాలనుకుంటారు. చివరకు ఎన్నికల కమీషన్ కూడా తన చెప్పు చేతల్లో ఉండాలనుకుంటారు. జూన్ 8 వతేదీ వరకు ముఖ్యమంత్రిగా ఉండే హక్కు తనకు ఉందని చంద్రబాబు చెప్పుకొంటున్నారు. హక్కు ఉంది మేం కాదనడం లేదు. కానీ కోడ్ అమల్లో ఉన్నా అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. భారత రాజ్యాంగంలో అందరు దానికి లోబడే ఉండాలి కదా? `` అని బొత్స ప్రశ్నించారు.
చంద్రబాబు ప్రజావిశ్వాసం, అన్ని రాజకీయపార్టీల విశ్వాసం కూడా కోల్పోయారని బొత్స వెల్లడించారు. ``జాతీయపార్టీ నేతలు, ఆయన జాతి నేతలు.ఈ రెండు వర్గాలే ఆయనను నమ్ముతున్నారు. చంద్రబాబు పరిపాలన విధానం అలా ఉంది ఎవరికి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేదు.అందర్ని మోసం, దగా చేశారు.`` అని తెలిపారు. ``చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ లో చెప్పారంట..మళ్లీ నేను అధికారంలోకి రాబోతున్నాను.మీతో పరిచయాలు ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సంభందాలు కంటిన్యూ చేయండి అని సూచించారంట. ఇలా కుతంత్రాలు కుయుక్తులు చేస్తే ప్రజలు రాళ్లతో కొడతారు. మీ మాటలు బయటపెట్టమంటారా? ప్రజలంటే తమాషాగా ఉందా ప్రజాస్వామ్యాం అంటే గౌరవం లేదా? `` అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో నీటి కొరత ఉంది దానిపై సమీక్షలు చేస్తే ప్రజలు ఆహ్వానించే వారు కానీ తనకు రావాల్సిన బకాయిలు,అవినీతి కోసం సమీక్షలు చేస్తున్నారు కాబట్టే ఈసీ వాటిని కాదంటోందని బొత్సా సత్యనారాయణ పేర్కొన్నారు. ``ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినతర్వాత 18 రహస్య జిఓలు విడుదల చేశారు. నోటిఫికేషన్ వచ్చాక దాపరికం ఏంటి?ఇవన్నీ బయటకు వస్తాయి. నీచరిత్ర అంతా బయటకు వస్తుంది. ఇటువంటి పరిస్దితులు చేస్తూ లేనిపోని ఆశలు కల్పించడం.మీ తాలుకూ పోలీసు ఇంటిలిజెన్స్ ,,మీ సంస్దలు చేసిన సర్వేలు ఏమి చెబుతున్నాయే మీకు తెలుసు. మేం మీ సర్వే టీముల ట్యాబులన్నింటిని డిజిపికి అప్పగించిన సమయంలోనే మాకు అనిపించింది.దీంట్లో ఏదో నిగుఢమైన విషయం కుట్ర ఉందని బావించాం. మా సమాచారం అంతటిని కూడా సేకరించారనే విషయం ఐటిగ్రిడ్ ద్వారా బయటపడిపోయింది కదా? దీనికి చంద్రబాబు అండ్ కో ఏం సమాధానం చెప్తారు? కొన్నిరోజులలో ప్రజాప్రభుత్వం రాబోతుంది.`` అని వెల్లడించారు.