టీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల గురించి మరో సంచలన ఎపిసోడ్ తెరమీదకు వచ్చింది. కాంగ్రెస్ తరఫున గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. వారిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారామ్ సంచలన విమర్శళు చేశారు. గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ డబ్బులకు అమ్ముడు పోయే ఎమ్మెల్యేలు పార్టీ మారారని ఆరోపించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని మానవతారాయ్ ఆరోపించారు. టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం కేసీఆర్ అత్యంత ఖరీదైన భూములను కట్టబెడుతున్నారని ఆరోపించారు. ప్రజాకూటమి తరపున గెలిచిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఐదు కోట్ల భూమిని కాజేయడానికి కేసీఆర్కు అమ్ముడు పోయారని ఆరోపించారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్కు ఖమ్మం నడిబొడ్డున రూ 100 కోట్ల విలువైన పదివేల గజాల స్థలాన్ని, కాంగ్రెస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు పాల్వంచలో 80 ఎకరాలను కట్టబెట్టి తన పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డికి కాంట్రాక్టులు ఇవ్వజూపారని చెప్పారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్లీ గెలవాలని మానవతారాయ్ సవాల్ విసిరారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై లోక్పాల్లో ఫిర్యాదు చేయనున్నట్టు మానవతారాయ్ తెలిపారు. ఫిర్యాదు చేసిన వారికి రక్షణ కల్పించాలని కోరారు. ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అన్నారు.