ఒకవైపు సర్వేలు, రాజకీయ విశ్లేషకులు అంతా ఈ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారం చేపట్టడం ఖాయమని జోస్యం చెప్తున్న తరుణంలో...టీడీపీ నేతలు సైతం అదే అంచనాతో ఉన్నారు. తామే అధికారం చేపడతామని ప్రకటిస్తున్నారు. అలా అధికారంపై విశ్వాసం వ్యక్తం చేసిన నాయకుల్లో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఓ అడుగు ముందుకు వేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. నంద్యాల ఫలితాలే ఏపీలో పునరావృతం కాబోతున్నాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించేది తెలుగుదేశం పార్టీయేనని టీడీపీ నేత, ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్నారని, చంద్రబాబు సీఎం కావడాన్ని దేవుడు కూడా అడ్డుకోలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ డబ్బులతో గెలవలేడనే విషయం మే 23న వెలువడనున్న ఫలితాలతో తేలిపోనుందని సోమిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సమీక్షలపై స్పందిస్తూ, తమది కేర్ టేకర్ గవర్నమెంట్ కాదని, ఎలక్టెడ్ ప్రభుత్వమన్నారు.
ఇక ఈసీపై సైతం సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచ ఏశారు. ఎన్నికలు నిర్వహించడంలో వైఫల్యం చెందిన ఈసీ సిగ్గుతో తలదించుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన... వీవీ ప్యాట్లను యాభై శాతం లెక్కించడం అంటే జగన్, ఈసీ కి ఎందుకు భయం .? అని ప్రశ్నించారు. ప్రధాని నరేండ్ర మోడీ కనుసన్నల్లో ఈసీ తప్పులు చేసిందని.. చేసిన తప్పుపై ఈసీ జాతికి సమాధానం చెప్పాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. విజయ సాయిరెడ్డి చెబితే చాలు.. ఎస్పీలను, కలెక్టర్లను ట్రాన్ఫఫర్ చేస్తున్నారని.. ఇది చాలా దారుణమైన విషయం అని మండిపడ్డారు.