ఇంటర్ ఫలితాలపై జరుగుతున్న గందరగోళంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఇంటర్ బోర్డు వ్యవహారంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్, విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్రెడ్డిల సమక్షంలో ఇంటర్ ఫలితాల వివాదంపై సమీక్ష నిర్వహించారు. మార్కుల వ్యవహారంపై చర్చించినట్లు తెలుస్తోంది. మార్కుల విషయంలో జరిగిన అవకతవకలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఎస్ఎస్సీ పరిధిలోనే ఇంటర్ విద్య ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఫలితాల విడుదలలో అసలేం జరిగింది. తప్పులు ఎందుకొచ్చాయనే అంశంపై కేసీఆర్ పూర్తిస్థాయిలో సమీక్షి చేపట్టారు. ప్రధానంగా గ్లోబరేనా సంస్థకు ఒప్పందం అప్పగించడంతో పాటు మూల్యాంకనలో తప్పు జరిగిందా.. వివరాల నమోదులో జరిగిందా..? అన్న విషయాలపై ఆరా తీశారు. విద్యార్థులకు పూర్తిస్థాయిలో న్యాయం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చిస్తున్నారు.
సీబీఎస్ఈ తరహాలో 10+2 విధానం అమలుకు అవకాశం కనిపిస్తోంది. దీనిపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఇంటర్ బోర్డును పూర్తిగా రద్దు చేసే కీలక ప్రకటనను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద ఎస్ఎస్సీ పరిధిలోకే ఇంటర్ విద్యా రానున్నట్లు తెలుస్తోంది.ఈ నిర్ణయంతో కార్పొరేట్ విద్యాసంస్థలు, ప్రైవేట్ కళాశాలలకు చెక్ పెట్టొచ్చన్న భావనలో కేసీఆర్ ఉన్నారు.
ఇంటర్ విద్యలో విద్యార్థులు చాలా ఒత్తిడికి గురి కావడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థులపై లెక్చరర్ల ఒత్తిడి చాలా తీవ్రంగా ఉండడమే ఈ నిర్ణయానికి కారణంగా కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ విద్యార్థు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని దీనికి ఒక శాశ్వత పరిష్కారం దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు మరిన్ని కీలక నిర్ణయాలను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది.