ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ట్విస్ట్ల పరంపరకు శుభం కార్డు పడింది. ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డి అని తేల్చిన పోలీసులు జయరాం మేనకోడలు శిఖా చౌదరికి క్లీన్చిట్ ఇచ్చారు. కార్మిక సంఘం నేత బీఎన్ రెడ్డి ప్రమేయం కూడా ఉన్నట్లు చార్జిషీట్లో దాఖలు చేశారు. రాకేశ్ రెడ్డిపై పీడీ యాక్ట్ను పోలీసులు నమోదు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
జనవరి 31న చిగురుపాటి జయరాం కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతంలో తన కారులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో చంసలనం సృష్టించింది.పోలీసుల విచారణలో రాకేష్ రెడ్డి అన్ని విషయాలు పూస గుచ్చినట్లు చెప్పాడు. జయరాం హత్యకు వారం రోజుల ముందే స్కెచ్ గీసినట్లు చెప్పాడు. అలాగే తాను హత్య చేస్తున్నట్లు రౌడీషీటర్ నగేష్, విశాల్, శ్రీనివాస్ లకు ముందే చెప్పాడు. దస్పల్లా హోటల్ నుంచి వీణా మేడం డ్రైవర్ నంటూ కమెడీయన్ సూర్య జయరాంను కారులో ఎక్కించుకొచ్చాడని వివరించాడు. హత్య చేసేటప్పుడు సీన్ లో నలుగురు ఉన్నారు. ఆ తర్వాత డెడ్ బాడీతో నల్లకుంట పీఎస్ కు వెళ్లామని.. సీఐ శ్రీనివాస్ తో మాట్లాడినట్లు రాకేష్ చెప్పాడు. జయరాంను బెదిరించి వంద రూపాయల బాండ్ పేపర్ల మీద సంతకాలు చేయించుకున్నానని.. అతను చచ్చిపోతే ఆస్తులన్నీ తనకు దక్కుతాయని హత్యకు ప్లాన్ చేసినట్లు తెలిపాడు. సీఐతో మాట్లాడాక యాక్సిడెంట్ గా క్రియేట్ చేసేందుకు నందిగామ వెళ్లి కారును అక్కడ వదిలేసినట్లు రాకేష్ చెప్పాడు.
కేసు దర్యాప్తును కొలిక్కి తేవడంలో భాగంగా, మొత్తం 70మంది సాక్ష్యులను విచారించిన పోలీసులు.. 390 పేజీలతో కూడిన చార్జిషీట్ను రూపొందించారు. అందులో రాకేశ్ రెడ్డితో పాటు ఆధారాలు తారుమారు చేసేందుకు సహకరించిన ఆయన అనుచరులు శ్రీనివాస్, సినీ నటుడు సూర్య ప్రసాద్, కిశోర్, విశాల్, నాగేశ్, అంజిరెడ్డి, సుభాష్రెడ్డిలపై చార్జిషీట్ దాఖలు చేశారు.