కౌంటింగుకు డేట్ దగ్గరపడుతున్న కొద్దీ టీడీపీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. వారికి ఒక రకమైన భయాలు కావు, చాలా కలగాపులగంగా పెనవేసుకుని ఉన్న భయాలు. టీడీపీ ఈ ఎన్నికలో గెలుస్తుందా, భావి నాయకుడు లోకేష్ మంగళగిరిలో విజయం సాధిస్తారా. కేంద్రంలో మళ్ళీ మోడీ అధికారంలోకి వస్తారా. మూడవ కూటమి గెలుస్తుందా ఇలా అనేక భయలు, సందేహాలు టీడీపీ నేతల్లో ఉన్నాయి.
ఇదిలా ఉండగా మంగళగిరిలో లోకేష్ ఓడిపోతారని సర్వేలు ఒక్కటిగా ఘోషిస్తున్నాయి. అలాగే టీడీపీకి ఈ ఎన్నికల్లో పరాజయం తప్పదని కూడా సంకేతాలు వస్తున్నాయి. ఇక చాలా మంది మంత్రులు ఈ ఎన్నికల్లో ఓటమి బాట పడతారని అంటున్నారు. మొత్తానికి టీడీపీకి ఈ ఎన్నికల్లో ఓటమి ఎదురైతే మాత్రం చాలా దారుణమైన పరిస్థితిని ఆ పార్టీ ఎదుర్కోవాల్సివుంటుందని అంటున్నారు.
లోకేష్ కనుక ఓడిపోతే ఆయన మరో అయిదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండాలి.
పార్టీ పగ్గాలు కూడా అందుకోవడానికి ఎక్కడా ఆయనకు అవకాశం ఉండదు, పార్టీ కూడా లోకేష్ ని గెలుపు గుర్రంగా పరిగణించదు. అటువంటి వేళ లోకేష్ మరో అయిదేళ్ల పాటు తండ్రి చాటు బిడ్డగానే ఉండాల్సివస్తుందని అంటున్నారు. చంద్రబాబు వయసు మీద పడుతున్నా పార్టీ బండిని లాగాల్సివస్తుందని చెబుతున్నారు. ఇక పార్టీలో చాలా మంది సీనియర్లు రాజకీయాల నుంచి తప్పుకుంటారని టాక్ నడుస్తోంది. కొత్త రక్తం యువత వైసీపీ వైపు మళ్ళితే టీడీపీ కోలుకోవడం ఓ విధంగా కష్టమే. సిధ్ధాంతాల పునాది మీద నడిచే పార్టీలకే ఇపుడు ఇబ్బందులు తప్పడంలేదు. అలాంటిది గాలివాటు రాజకీయం చేస్తున్న టీడీపీలో ఓటమి భయంకరమైన రాజకీయాన్ని చూపిస్తుందని విశ్లేషిస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.