తీసుకున్న డబ్బులకు లెక్క చెప్పాకుండా మళ్లీ కొత్త అప్పు అడిగితే ఎవరైనా ఇస్తారా? కన్న తండ్రి కూడా ఇవ్వడు. పాలకుల పుణ్యమా అని ఏపి ప్రభుత్వం ఇప్పుడు ఈ దారుణమైన పరిస్థితిలోకి వచ్చేసింది. కేవలం ఒక్క ఏప్రిల్ నెలలో (కొత్త బడ్జెట్ ప్రారంభమై కేవలం 26 రోజులే అయింది సుమారు రూ.8,255 కోట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజర్వు బ్యాంకు నుంచి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకున్నది. మళ్లీ ఇప్పుడు ఇంకో వెయ్యి కోట్ల రూపాయల అప్పు కావాలని కోరుతూ లేఖ రాసింది. దీనికి ప్రతిగా రిజర్వుబ్యాంకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది.
ఇప్పటికే తీసుకున్నఓవర్ డ్రాఫ్ట్కు లెక్క చెప్పాలని, లేకపోతే మళ్లీ ఇవ్వడం కుదరదని ఆ లేఖ సారాంశం. ఈ లేఖ నేడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చేరడంతో ఆయన ఒక్క సారిగా ఉలిక్కి పడ్డారు. ఆయన ఇప్పుడు ఈ లేఖకు సమాధానం పంపించాలి. ఇప్పటి వరకూ ఆ రాష్ట్రాన్ని ఏలిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగానీ, ఆర్ధిక మంత్రిగా అధికారం చెలాయించిన యనమల రామకృష్ణుడుగానీ, ఇంత కాలం పదవిలో ఉండి లెక్కలు అడగగానే శలవులో వెళ్లిపోయిన ఆ రాష్ట్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్రగానీ సమాధానం చెప్పే స్థితిలో లేరు కదా అందుకని ఇప్పుడు ఆ బాధ్యత ప్రధాన కార్యదర్శిపైన పడింది.
మొదటి లేఖను తొక్కి పెట్టారు :
ఇప్పటికే రిజర్వుబ్యాంకు ఒక లేఖ రాయగా అప్పుడు పూర్తి స్థాయి అధికారంలో ఉన్న ఆ పెద్దలు దానికి సమాధానం కూడా ఇవ్వకుండా వచ్చిన డబ్బును ఖర్చు చేసే బిజీలో ఉండిపోయారు. ఈ నెల 5వ తేదీన రూ.92.08 కోట్లు రిజర్వు బ్యాంకు నుంచి ఓడీ తీసుకున్నారు. 6వ తేదీన రూ.2513.27 కోట్లు, 9వ తేదీన 650.61 కోట్లు తీసుకున్నారు. 10వ తేదీన ఏకంగా రూ.5 వేల కోట్ల రూపాయలు తీసేసుకున్నారు. మళ్లీ ఇంకో వెయ్యి కోట్ల రూపాయలు కావాలని రిజర్వుబ్యాంకును అడగడంతో చిర్రెత్తుకొచ్చిన రిజర్వుబ్యాంకు తాఖీదు పంపి పాత లెక్కలు అడుగుతున్నది. ఏ ప్రభుత్వమైనా కూడా వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ వాడుకోవడం అంటే అది తలవంపులే. అలా జరగకుండా అన్ని ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుని అలాంటి పరిస్థితి వస్తే పొదుపుగా ఖర్చు పెడతారు. అయితే ఆంధ్రప్రదేశ్ మాత్రం యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్ ఆర్ధిక మంత్రి ఉన్నందుకో ఏమో కానీ 2018-19 ఆర్ధిక సంవత్సరంలో 79 రోజులు వేస్ అండ్ మీన్స్ కిందకు వెళ్లగా 34 రోజుల పాటు ఓవర్ డ్రాఫ్ట్ మీద ప్రభుత్వాన్ని నడిపారు.
పరువుతక్కువ పని చేసిన తెలుగుదేశం ప్రభుత్వం :
ఇలా వేస్ అండ్ మీన్స్, స్పెషల్ వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్లపై 2018-19 ఆర్ధిక సంవత్సరంలో రూ.20.80 కోట్లు, 14.23 కోట్లు, 4.22 కోట్ల రూపాయల వడ్డీని చెల్లించారు. అంటే మొత్తం రూ.39.25 కోట్లు. ఎంత పరువు తక్కువ పని? ఇంత దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఉండగా లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినట్లు ఇప్పటికే వెల్లడి అయింది. ఇంకా పూర్తి వివరాలలోకి వెళితే మరిన్ని లెక్కలు బయటపడతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అత్యంత దారుణంగా దిగజార్చిన కాంప్రహెన్సీవ్ ఫైనాన్షియల్ మేనేజిమెంట్ సిస్టమ్ (సి ఎఫ్ ఎం ఎస్)పై సమగ్ర విచారణకు ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం ఇప్పటికే ఆదేశించారు. సి ఎఫ్ ఎం ఎస్ ఏ విధంగా ఖజానాను లూటీ చేసిందనే విషయం సత్యం న్యూస్ డాట్ నెట్ ఇటీవల వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అదే విధంగా ఎన్నో అంశాలపైనా తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అధికార దుర్వినియోగంపైనా విచారణ జరగాల్సి ఉంది.
ఏపి బడ్జెట్ గురించి మరి కొన్ని వివరాలు :
2017-18 ఆర్ధిక సంవత్సరంలో రాబడి పన్నుల ద్వారా రూ.52,717 కోట్లు
పన్నేతర ఆదాయం రూ.5,347 కోట్లు
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినది రూ.66,837 కోట్లు
మొత్తం రాబడి రూ. 1,24,901 కోట్లు
మొత్తం ఖర్చు రూ.1,51,297 కోట్లు
2017-18 ఆర్ధిక సంవత్సరంలో నికర లోటు రూ.26,396 కోట్లు
ఇంత దారుణంగా ఉన్న పరిస్థితిలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా యధేచ్ఛగా తన వారికి దోచి పెట్టింది. దీనిపైనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం దృష్టి సారించడంతో తమ అధికారాలను ప్రధాన కార్యదర్శి గుంజుకున్నాడని, ప్రధాన కార్యదర్శి రాజ్యాంగేతర శక్తిగా మారాడని విమర్శలు గుప్పిస్తూ ఆయనను లొంగదీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పూర్తి బాధ్యతలతో రంగంలో దిగిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజ్యాంగేతర శక్తా? ఇంత కాలం జరిగిన దోపిడిని బయటకు తెస్తున్న ప్రధాన కార్యదర్శి రాజ్యాంగేతర శక్తా?