కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క ఊహించని రీతిలో అనారోగ్యం పాలయ్యారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి పాలన చేస్తున్నారని విమర్శిస్తూ...ఆయన నిరసన యాత్ర చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే భట్టి విక్రమార్క యాత్ర దాదాపు ముగింపునకు వచ్చింది. అయితే, అధికారపార్టీ తీరును ఎండగడుతూ ప్రజల్లోకి వెళుతున్న ఆయన అకస్మాత్తుగా ఆస్పత్రి పాలయ్యారు.
నిరంతరాయంగా సాగుతున్న యాత్ర వల్ల విక్రమార్కకు వడదెబ్బ తగిలింది. దీంతో ఆయన్ను వెంటనే ఖమ్మంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. భట్టిని పరీక్షించిన వైద్యులు వడదెబ్బ కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించిందని జ్వరంతో నీరసంగా ఉన్నారని వెల్లడించారు. ప్రస్తుతం భట్టి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఒకట్రెండు రోజుల తర్వాత డిశ్చార్జి చేస్తామన్నారు. ఇదిలాఉండగా, అనారోగ్యం కారణంగా సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రకు స్వల్ప విరామం ప్రకటించారు. డిశ్చార్జీ అయిన తర్వాత మళ్లీ కొనసాగించాలని నిర్ణయించారు.