ఫొని తుఫానుపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చే్స్తున్న ప్రకటనలపై వైసీపీ ఎంపీ, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. సీఎం సమీక్ష అనంతరం చేసిఆయన చేసిన వ్యాఖ్యలను స్పందిస్తూ విజయసాయి ట్వీట్లు కురిపించారు. ``తుపాకి రాముడి కోతలు మొదలయ్యాయి. అదికార యంత్రాంగం రేయింబవళ్లు తుఫానుకు ఎదురొడ్డి ప్రాణనష్టం లేకుండా చూస్తే అభినందించాల్సింది పోయి వాళ్ల క్రెడిట్ కొట్టేస్తున్నాడు. కలెక్టర్లు, సిబ్బంది స్పందించిన తీరు ప్రశంసనీయం. థాంక్యూ సీఎం అని హోర్డింగులు పెట్టుకోలేకపోయానని చంద్రబాబు బాధ`` అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చంద్రబాబు తీరును తప్పుపట్టారు.
సీఎం చంద్రబాబు చేసుకున్న ప్రచారంపైనా ఆయన ఘాటుగా స్పందించారు. ``ఫోని తుఫాను సహాయ చర్యలకు తమ హెల్ప్ కావాలంటే చెప్పాలని ఒరిస్సా సీఎంను చంద్రబాబు అడిగారట. గతంలో తిత్లీ తుఫాను తీరం దాటక ముందే ‘థ్యాంక్యూ సీఎం సార్, తుఫాను నుంచి మా ప్రాణాలు రక్షించినందుకు’ అని సొంతంగా హోర్డింగులు పెట్టించుకున్నట్టే ఉంది ఈ వ్యవహారం కూడా`` అంటూ ఎద్దేవా చేశారు. ``తుఫాన్లు వచ్చినపుడల్లా పచ్చ చొక్కాలకు కోట్ల విలువైన పనులను నామినేషన్ మీద ఇచ్చి ప్రజాధనాన్ని పంచిపెట్టేవారు చంద్రబాబు. ఫోని తర్వాత కలెక్టర్లు నిబంధనల ప్రకారం పారదర్శకంగా నడుచుకోవాలి. విద్యుత్తు పునరుద్ధరణకు జాప్యం జరగకుండా చూసుకోవాలి`` అని కోరారు.
ఈ సందర్భంగా ``ఫోని తుఫాను సహాయ పనులు చంద్రబాబుకు సంబంధం లేకుండానే జరుగుతుండటంతో ఎల్లో మీడియా ప్రభుత్వ యంత్రాంగంపై బురద చల్లే వార్తలు కుమ్మరిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో శిబిరాల్లో ఉన్న ప్రజలకు భోజన వసతి సరిగా లేదని గొట్టాలు పెట్టి గోల చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలతో తిట్టిస్తున్నారు.``అంటూ ఓ ట్వీట్లో తప్పుపట్టారు. ``ఫొని బీభత్సం వల్ల ప్రాణ నష్టం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు. ఎటువంటి ప్రచార హడావుడి లేకుండా మూడు రోజులుగా అవిశ్రాంతంగా కష్టపడ్డారు. విద్యుత్తు పునరుద్ధరణ, మంచినీటి సరఫరా అందజేసి ప్రజలు ఎవరిళ్లకు వారు చేరేలా జాగ్రత్తలు తీసుకోవాలి.`` అని సూచించారు.
గ్రూప్స్ పరీక్ష విషయంలో విజయసాయిరెడ్డి కీలక ట్వీట్ చేశారు. ``ఉత్తరాంద్రలో తుఫాను పునరావాస పనులు జరుగుతున్నాయి. మరోపక్క ఎన్నికల కోడ్ అమలులో ఉండగా గ్రూప్-2 పరీక్షలు నిర్వహించడమేమిటి? మరో నెల రోజులు వాయిదా వేయలేరా? ఏపీపిఎస్సీ ఛైర్మన్ దేనికో హడావుడి పడుతున్నట్టు కనిపిస్తోంది. గవర్నర్ జోక్యం చేసుకుని వాయిదా వేయించాలి``అని కోరారు.