తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న పరిషత్ తెలంగాణలో ఆసక్తికర రాజకీయాం సాగుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ అనే తేడా లేకుండా కుటుంబ రాజకీయంలో బిజీ బిజీగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే కీలకమైన ఎమ్మెల్యే పదవులు, పార్టీ పదవుల విషయంలో కనిపించిన ఈ ట్రెండ్ తాజాగా పరిషత్ ఎన్నికల్లోనూ తెరమీదకు వచ్చిందంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న జెడ్పీటీసీ ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్ పీఠం కైవసం చేసుకునేందుకు ఆ రెండు పార్టీల నేతలు చేస్తున్న ప్రయత్నాలు దీనికి అద్దం పడుతున్నాయి.
రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కావడంతో ఇక్కడి నుంచి మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు డాక్టర్ అనితారెడ్డిని, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా మాజీ మంత్రి మహేందర్రెడ్డి భార్య సునీతా మహేందర్రెడ్డిని బరిలోకి దించింది. మహబూబ్నగర్ జడ్పీ చైర్మన్ జనరల్కు రిజర్వు కావడంతో అమరచింత మాజీ ఎమ్మెల్యే, నవలా రచయిత్రి స్వర్ణా సుధాకర్రెడ్డిని బరిలోకి దించింది.
వరంగల్ రూరల్ జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిగా గండ్ర జ్యోతిని బరిలోకి దింపింది. గండ్ర జ్యోతి భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి భార్య కాగా, ఆయన ఇటీవల టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. యాదాద్రి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి జనరల్కు రిజర్వు కావడంతో అక్కడి నుంచి మాజీ మంత్రి ఏలిమినేటి ఉమామాదవరెడ్డి కుమారుడు సందీప్రెడ్డిని బరిలోకి దింపింది. మంచిర్యాల జడ్పీ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు భార్య భాగ్యలక్ష్మిని బరిలోకి దింపింది.
ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సైతం ఈ రాజకీయానికి ఏమాత్రం తీసిపోకుండా తమ కుటుంబ సభ్యులకే చాన్స్ ఇచ్చుకుంటోంది. నల్లగొండ జడ్పీ చైర్మన్ జనరల్కు రిజర్వు కావడంతో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి మోహన్రెడ్డిని చైర్మన్ అభ్యర్థిగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. నాగర్కర్నూల్ జడ్పీ చైర్మన్ ఎస్సీకి రిజర్వు కావడంతో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ భార్య అనురాధ వంశీకృష్ణను చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది.