సార్వత్రిక ఎన్నికల వేడి ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఎన్నికల ప్రచారంలో తమదైన శైలిలో పార్టీలు దూసుకెళ్తున్నాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఎన్నికల ప్రచారానికి పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. అయితే, ఢిల్లీకి దగ్గరి దారి అనే పేరున్న యూపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తాజాగా సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ బీజేపీని ఎదుర్కొనేందుకు ఏకంగా ఓ డూప్ను రంగంలోకి దించాడు. ఏకంగా యూపీ సీఎం యోగి లాంటి వ్యక్తిని రంగంలోకి దించడం సంచలనం సృస్టిస్తోంది.
బీజేపీ వివిధ ప్రాంతాల్లో యోగి ఆదిత్యనాథ్తో ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, యూపీలో మాత్రం ఆయన లాంటి నకిలీ వ్యక్తితో ప్రచారానికి అఖిలేష్ వ్యూహాలు రచించారు. డూప్ యోగి బాబాకు సంబంధించిన ఫోటోలను అఖిలేశ్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ``మేం నకిలీ దేవుడిని తీసుకురాలేదని.. ఒక బాబాను తీసుకొచ్చాం`అటూ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. గోరఖ్పూర్ నుంచి ఆ బాబా మాతో వచ్చారని.. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అసలైన నిజాలను యూపీ వాసులకు వివరిస్తారని అన్నారు. అయితే ఆ బాబా మొఖాన్ని మాత్రం చూపించలేదు.
బీజేపీని టార్గెట్ చేసేదుకు ఓ సీఎంకు బదులుగా నకిలీ వ్యక్తిని మాజీ సీఎం రంగంలోకి దింపడం సంచలనం రేకెత్తిస్తోంది. సైకిల్ పార్టీ నేత వేసిన ఈ అడుగుపై బీజేపీ నేతలు, ప్రధానంగా యోగి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.