ఇంటర్మిడియట్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళాన్ని చక్కదిద్దేందుకు బోర్డు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికీ విపక్షాలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యం లో... ఇంటర్మిడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. జవాబు పత్రాల రి-వేరిఫికేషన్తో గ్లోబరినా సంస్థకు ఎలాంటి సంబంధం లేదని ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా రెండు రకాలైన రీ వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు వివరించారు.
రాష్ట్రంలో ఏప్రిల్ 25వ తేదీ నుంచి 12 మూల్యాంకన కేంద్రాల్లో జవాబు పత్రాలను అధ్యాపకులు రి-వేరిఫికేషన్ చేస్తున్నారని తెలిపారు. రి-వేరిఫికేషన్ తరువాత ఆ మార్కులు ఇంటర్మిడియట్ బోర్డుకు పంపించడం జరుగుతుందని ప్రకటనలో తెలిపారు. ఇలా వచ్చిన మార్కులతో రిజల్ట్స్ ప్రాసెసింగ్ చేయడానికి త్రిసభ్య కమిటీ సూచనల మేరకు తెలంగాణ స్టేట్ టెక్నాలజీకల్ సర్వీసెస్(టీఎస్టీఎస్) సంస్థ ద్వారా ఒక కంప్యూటర్ ఏజెన్సీని ఎంపిక చేయడం జరిగిందన్నారు.
నోయిడాకు చెందిన డేటాటెక్ మెథడిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజెన్సీని రిజల్ట్ ప్రాసెసింగ్ కొరకు ఎంపిక చేసినట్లుగా తెలిపారు. డేటాటెక్ మెథడిక్స్ సంస్థ, గ్లోబరినా సంస్థ రెండు వేరు వేరుగా జవాబు పత్రాల రి-వేరిఫికేషన్ తరువాత వచ్చిన మార్కులతో రిజల్ట్స్ ప్రాసెసింగ్ సమాతరంగా (వేరు వేరుగా) చేసి ఆ రెండు ఫలితాలను సరిపొల్చుకొని సరి అయినవిగా నిర్థారించిన తరువాత రి-వేరిఫికేషన్ ఫలితాలను విడుదల చేయడం జరుగుతుందన్నారు.
ఈ రెండు సంస్థల ఫలితాల విశ్లేషణలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) , జెఎన్టీయూ ల పర్యవేక్షణలో జరుగుతుందన్నారు. విద్యార్థులు, తల్లి దండ్రులు, జవాబు పత్రాలను అధ్యాపకుల ద్వారా రి-వేరిఫికేషన్ చేసిన ప్రక్రియ , ఫలితాల ప్రాసెసింగ్ పట్ల ఎటువంటి అనుమానాలు, అపోహలు పెట్టుకోరాదని , ఆందోళన చెందవద్దని ఆశోక్ కుమార్ కోరారు.