దొంగతనాలల్లో క్రియేటివిటీ ప్రవేశిస్తోంది. గతంలో ఎన్నో దొంగతనాలు చూసాం కానీ ఈ తరహా దొంగతనం మరెక్కడా చూడలేదు. కారులో దర్జాగా ఓ వానరంతో వచ్చిన ఘరానా దొంగ చూస్తుండగానే ఐదు వేల నోట్ల కట్టను చిటికెలో ఎగరేసుకుపోయాడు. కాన్పూరులోని ఓ హైవే టోల్ బూత్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానిక బారా టోల్ ప్లాజాలోని సీసీ కెమెరా ఈ దృశ్యాన్ని రికార్డు చేసింది.
పట్టపగలు టోల్ కౌంటర్లో కుర్రాడు చూస్తుండగానే ఓ తెల్లకారు వచ్చింది. రోటీన్గానే చూస్తున్న క్యాష్ కౌంటర్ కుర్రారు ఒక్కసారిగా బిత్తరపోయాడు. కారులోంచి ఓ వానరం టోల్ బూత్ కౌంటర్లోకి ప్రవేశించింది. చాలా క్యాజువల్గా కుర్రాడి భుజం మీద చేయి వేసి కౌంటర్లో లెక్కపెట్టి ఉంచిన 5 వేల నోట్ల కట్టను చలాకిగా తస్కరించింది. ఆ వెంటనే కిటికీలోంచి కారులోకి జంప్ చేసి యజమానికి నోట్లు అందజేసింది.
అయితే క్యాష్ కౌంటర్లోని కుర్రాడు ఏం జరిగిందో గుర్తించేలోగానే వానం నోట్లను కాజేసింది. బాగా శిక్షణ పొందిన వానరాలే ఇలాంటి పనులు చేస్తాయంటున్నారు బూత్లోని ఉద్యోగులు. గతంలోనూ ఇదే బూత్లో ఇలాంటి మరో రెండు సంఘటనలు కూడా జరిగాయని టోల్ ప్లాజా జీఎం చెప్పారు. కాగా జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని దర్యాప్తు జరుగుతుందని ఆయన అన్నారు. ఈ ఘటనతో బూత్లో పనిచేయాలంటే భయంగా ఉందని ఉద్యోగులు వాపోతున్నారు.