తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో చురకుగా స్పందించే కేటీఆర్ సమస్య వచ్చిందంటే తనవంతు సహాయం చేయడంలో ముందుంటారనే పేరుంది. అలాంటి యువనేత తాజాగా మరో కీలకమైన సహాయం చేశారు. బతుకుదెరువు కోసం అబుదాబి వెళ్లిన ఓ తెలంగాణవాసి అక్కడ నరకం అనుభవిస్తున్నాడు. రెండేళ్లుగా పనిచేయించుకొంటూ జీతం ఇవ్వకుండా, తిండి పెట్టకుండా అరబ్ షేక్ నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ ఆ వ్యక్తి ఫేస్బుక్లో పెట్టిన వీడియోను.. నెటిజన్ ఒకరు ట్విట్టర్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంపారు. వీడియోను చూసిన కేటీఆర్ తక్షణమే స్పందించి.. ఆయనను ఇండియాకు తీసుకురావడానికి సాయంచేయాలని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, అబుదాబిలో భారత రాయబారికి విజ్ఞప్తిచేశారు. తక్షణం స్పందించి ఆయనకు విముక్తి కోసం కృషి చేశారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మక్తపల్లి గ్రామానికి చెందిన పాలేటి వీరయ్య జీవనాధారం కోసం అబుదాబి వెళ్లి.. నగరానికి 20 కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రాంతంలో ఒంటెను కాసే పనిలో కుదిరాడు. అయితే, రెండేళ్లుగా జీతం ఇవ్వకుండా, తిండి పెట్టకుండా వేధిస్తున్న యజమాని చేతిలో నరకయాతన అనుభవిస్తున్నాడు. ఆయన గోడు వెల్లబోసుకొంటున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవడంతో ఈ ఘటన అందరి దృష్టికి వస్తున్నది. ``కరీంనగర్ జిల్లా తిమ్మాపురానికి చెందిన నేను అబుదాబికి వచ్చి రెండేళ్లు అవుతోంది. యజమానికున్న 100 ఒంటెలను నేనొక్కడినే చూసుకోవాలి. ఒక ఒంటె చనిపోవడంతో యజమాని నన్ను బాగా కొట్టాడు. దాంతో దవడ పండ్లు ఊడిపోయి మాట్లాడటం కూడా రావడంలేదు. జీతం ఇవ్వకుండా, తిండి పెట్టక హింసిస్తున్నాడు. తల్లి చనిపోయినా పంపిస్తలేడు. సార్.. నన్ను ఇండియాకు తీసుకుపోండి`` అంటూ తన ఆవేదనను వ్యక్తంచేశాడు.
ఇలా బాధితుడు వీరయ్య కష్టాల వీడియోను నెటిజెన్ ఒకరు ట్విట్టర్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు పంపారు. దీనిపై వెంటనే స్పందించిన కేటీఆర్.. వీరయ్య కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. వీడియోను కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్, యూఏఈలో భారత రాయబారి నవదీప్ సూరి, అబుదాబిలో భారత ఎంబసీ అధికారులకు ట్యాగ్ చేస్తూ.. బాధితుడిని ఇండియాకు తీసుకురావడానికి సాయం చేయాల్సిందిగా కోరారు. దీనికి స్పందించిన రాయబారి సూరి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.