రాష్ట్రంలో వరకట్న వేధింపులు తీవ్ర కలకలం రేపుతున్నారు. ఇంకా ఎంత మంది ప్రాణాలు పోవాల్సి ఉంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. చాలా కుటుంబాల్లో ఇదే పరిస్థితి నెకొంది. ప్రతిరోజు టీవీల్లో.. పేపర్లలో వార్తలు చూస్తూనే ఉన్నాం. వాటికి సంబంధించి చట్టాలున్నాయి.. వాటిని అమలు చేసే అదికారులు కూడా ఉన్నారు.. కానీ ఏం లాభం.. అవే వ్యథలు.. అవే బలవన్మరణాలు.. కట్న దాహానికి అతివలు బలవుతూనే ఉన్నారు. నిన్న శ్రీలత.. ఇవాళ లావణ్య.. రేపు మరెవరో.. ఇలా ఎంత మంది ప్రాణాలు పోవాల్సి వస్తోందో...
ప్రేమ పెళ్లయినా.. పెద్దలు కుదర్చిన పెళ్లయినా సరే వరకట్న వేధింపులు తప్పడం లేదు. సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వారిలో ఎంత మందిని మనం తీసుకున్నా సరే ఇదే సమస్య నెలకొంది. ఎన్ఆర్ సంబంధమని మురిసిపోయినా.. ఆ తర్వాత మూన్నాళ్ల ముచ్చటగనే మారిపోతున్నాయి. వరకట్న వేధింపులకు అవతుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వరకట్న వేధింపులు తాళలేక తాజాగా మరో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
నిన్న శ్రీలత.. నేడు లావణ్య.. వరుసగా వరకట్న వేధింపులకు బలయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్ ఆర్ఐ భర్త వేధింపులతో లావణ్య అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తంగల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన లావణ్యకు ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన రవీందర్తో తొమ్మిది నెలల క్రితం పెళ్లైంది. అయితే పెళ్లయిన 15 రోజులకే లావణ్యతో కలిసి న్యూజిల్యాండ్ కు వెళ్లాడు రవీందర్. ఇక జల్సాలకు అలవాటు పడిన రవీందర్ లావణ్యను వేధించడం మొదలు పెట్టాడు.
ఈ క్రమంలో మూడు నెలల క్రితం వరకట్నం డబ్బులు తీసుకురావాలని లావణ్యను తిరిగి ఇండియాకు పంపించాడు రవీందర్. ఇటు అత్తింటి వారు కూడా కట్న కానుకలు తీసుకురావాలంటూ ఆమెను వేధించడం మొదలు పెట్టారు. చిత్ర హింసలకు గురి చేశారు. దీంతో వారి వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వచ్చింది లావణ్య. వారి చిత్రహింసలతో మనస్తాపం చెందిన లావణ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఇటు హైదాబాద్ రామంతాపూర్కు చెందిన శ్రీలత గాధ తీసుకున్నా కూడా అదే పరిస్థితి నెలకొంది. వీరిద్దరినీ వరకట్నం వేధింపులే కాటువేశాయి. ఉద్యోగాల్లో ఉన్నతస్థాయిలో ఉన్నా.. డబ్బులకు కొదవ లేకపోయి. కట్నం.. కట్నం.. కట్నం.. అంటూ కాల్చుకు తింటున్నారు ఎన్నారై మృగాళ్లు.
ప్రపంచం కుగ్రామంగా మారి అరచేతిలో అద్భుతాలు సృష్టిస్తున్న ఈ రోజుల్లో ఈ వరకట్నం వంటి అనాగరిక ఆచారాల పేరుతో ఆడుకునే వారిని కఠినంగా శిక్షించాలి. లేదంటే మరికొంత మంది అబలలు.. ఇలాంటి అఘాయిత్యాలకు ఒడిగట్టే ప్రమాదముంది. దీనిపై ఏదో ఒక స్పష్టమైన పరిష్కారం మాత్రం చేయాల్సి ఉంది. మున్ముందు ఇలాంటి ఘటనలకు మరింత మంది అబలలు బలికాకుండా చూడాల్సి ఉంది.