అసలు పేరయిన తూర్పు జయప్రకాష్ రెడ్డి కంటే అలియస్ పేరు అయిన `జగ్గారెడ్డి`తో సుపరిచితుడు అయిన కాంగ్రెస్ నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డి తెలంగాణ రాజకీయాల్లో ఫైర్బ్రాండ్ నేతగా సుపరిచితుడు. తెలంగాణా సీఎం కేసీఆర్ అంటే విరుచుకుపడే నేతగా ఆయన గురించి అందరికీ తెలుసు. అయితే, గత కొద్దికాలంగా, కేసీఆర్ విషయంలో తన దారిని మార్చుకున్నారు. ఒకప్పుడు కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేసిన జగ్గారెడ్డి ఇటీవల వరుసగా పొగడ్తల్లో ముంచెత్తారు. అయితే, తాజాగా ఆయన తన రూట్ మార్చుకొని కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
గత కొద్దికాలంగా,జగ్గారెడ్డి టీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటుగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్బై చెప్పనున్నారని పలు మీడియాలో వార్తలు వచ్చాయి. గతవారం దీనిపై జగ్గారెడ్డి ఆవేదనభరితంగా స్పందించారు. గాంధీభవన్లో జగ్గారెడ్డి చిట్ చాట్ చేస్తూ పార్టీ మారుతున్నారనే ప్రచారంపై తాను ఖండించినా...ఆ ఖండనకు విలువలేకపోయిందని, అందుకే స్పందించట్లేదని వ్యాఖ్యానించారు.
అయితే, తాజాగా మళ్లీ జగ్గారెడ్డి మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. టీఆర్ఎస్లోకి రావాలని కేసీఆర్, కేటీఆర్ బంధువులు ఆహ్వానించారని బాంబు పేల్చారు. గాంధీభవన్లో ఉంటానో.. తెలంగాణభవన్లో ఉంటానో త్వరలో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. యూపీఏ వస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ సేఫ్ జోన్లో ఉంటుందని తేల్చిచెప్పారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ రాజకీయంగా దెబ్బతిందని తెలిపారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలు, కేసీఆర్, కేటీఆర్ ఎంట్రీని ప్రస్తావించడం ద్వారా తెలంగాణ కాంగ్రెస్కు మరో షాక్ ఖాయమని అంటున్నారు. కాంగ్రెస్ కీలక నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హస్తానికి షాక్ ఇవ్వడం ఖాయమని కాంగ్రెస్ నేతలు టెన్షన్ పడుతున్నారు.