ఇటీవలి కాలంలో తనపై జోరుగా కామెంట్లు చేస్తున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంచ్లు వేశారు. ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కాంగ్రెస్తో సహా పలు పార్టీల నేతలను కలుపుకొని జాతీయ స్థాయిలో చంద్రబాబు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై మోదీ సెటైర్లు వేశారు. హర్యానాలోని రోహ్తక్లో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ విపక్ష పార్టీల నేతలు కూటమిగా ఏర్పడి ఈవీఎంల ట్యాంపరింగ్, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అంశాలపై దేశవ్యాప్తంగా అనవసరంగా అనుమానాలు రేకెత్తిస్తున్నారని విమర్శించారు. ఇందులో చంద్రబాబు నాయుడు ఉన్నారని మండిపడ్డారు.
శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ నేతలతో సమీక్ష సందర్భంగా ప్రధాని మోదీపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. గత ఐదేళ్లలో మోదీ చేసిందేంటో చెప్పాలని అన్నారు. టీడీపీతో పెట్టుకున్నప్పుడే మోదీ పతనం ప్రారంభమైందని చంద్రబాబు అన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టామన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయగలిగామన్నారు. ఓటమి నైరాశ్యంతోనే మోదీ చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని… ఇందుకు రాజీవ్ గాంధీపై చేస్తున్న ఆరోపణలే నిదర్శనమని అన్నారు.
చంద్రబాబు వరుసగా చేస్తున్న కామెంట్లు సహా ఇతర నేతల వ్యాఖ్యలపై మోదీ స్పందిస్తూ, ``సార్వత్రిక ఎన్నికల తొలి మూడు విడుతల ప్రచారంలో ప్రధాని మోదీని విమర్శించారు. ఆ మూడు దశల పోలింగ్ ముగిసిన తర్వాత గెలుపు పవనాలు ఎటువైపు ఉన్నాయో వాళ్లకు అర్థమైంది. ఓడిపోతామని గ్రహించాక ఇప్పుడు ఈవీఎంలను తప్పుపడుతున్నారు. క్రికెట్లో బ్యాట్స్మెన్ ఔటైన తర్వాత ఒక్కొక్కసారి అంపైర్ను నిందించినట్టుగా విపక్షాల తీరు ఉంది`` అని మోదీ విమర్శించారు.