హైదరాబాదీలకు కొత్త సంబురాల వేదిక సిద్ధమయింది. వివిధ కార్యక్రమాలకు, ఉల్లాసానికి కేంద్రంగా ఉండే శిల్పారామం ఇప్పుడు మరొకటి అందుబాటులోకి వచ్చింది. మూసీ ఒడ్డున మినీ శిల్పారామం రెడీ అయింది. హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ లే అవుట్ పక్కన మూసీ నది ఒడ్డున రూ.10 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు సిద్ధమవుతోంది.
ఏడున్నర ఎకరాల స్థలంలో, హెచ్ఎండీఏ 2018లో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టింది. మొత్తం30 మంది కార్మికులు ఉప్పల్లోని మినీ శిల్పారామానికి మెరుగులు దిద్దారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.10 కోట్లు నిర్ణయించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం(జూన్–2) నాడు ప్రారంభం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మాదాపూర్లోని శిల్పారామానికి పనిచేసిన కాంట్రాక్టర్లే ఇక్కడి పనులు చేపడుతున్నారు.
హస్త కళలు, చేనేత వస్త్రాలకు నిలయం మాదాపూర్లోని శిల్పారామం. ఉప్పల్ భగాయత్ లే అవుట్ పక్కన రెడీ అయిన ఈ మినీ శిల్పారామంలోనూ హస్తకళలు, చేనేత వస్త్రాల కోసం 50 స్టాళ్లను నిర్మించారు. అలాగే పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు సేదతీరడానికి మైదానాన్ని సిద్ధం చేశారు. గ్రీనరీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే శిల్పారామం ఆర్చీ పూర్తయ్యింది. దీనికి ఎదురుగా పౌంటేన్ను నిర్మించారు.
విభిన్న రుచులతో ఫుడ్ కోర్టు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు పెద్ద స్టేజ్(యాంపీ థియేటర్)ని సిద్ధం చేశారు. వెదురు బొంగులతో స్టాళ్లు నిర్మించారు. ఇప్పటికే రకరకాల మొక్కలు నాటారు. మూసీనది ఒడ్డున ఎప్పటికే పెంచిన మొక్కలు సువాసను వెదజల్లుతుండటంతో పరిసరాలు ఆహ్లారభరితంగా మారాయి. సందర్శకులు ఈ కేంద్రాన్ని ఆస్వాదిస్తారని పేర్కొంటున్నారు.