సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అనేక చిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. హోరాహోరీగా సాగుతున్న పోరులో ఆరో దశ పోలింగ్ ఆదివారం జరిగింది. అయితే, ప్రియాంక గాంధీ భర్త రాబార్డ్ వాద్రా ఊహించని రీతిలో వార్తల్లోకి ఎక్కారు. ఆదివారం జరిగిన ఆరో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్లో లోధి ఎస్టేట్లోని సర్దార్పటేల్ పాఠశాలలో సతీమణి ప్రియాంకతో కలిసి ఆయన ఓటుహక్కు వినియోగించుకున్నాడు. అయితే, ఓటింగ్ అనంతరం ఆయన చేసిన పని నవ్వులాటకు కారణంగా మారింది.
ఓటు హక్కు వినియోగించుకున్నానని చెబుతూ వాద్రా ట్విటర్లో ఓ పోస్టు పెట్టాడు. తన ట్వీట్లో భారత జెండా గుర్తుకి బదులుగా పరాగ్వే జాతీయ జెండాను పోస్ట్ చేశారు. ఇరు జెండాలు మూడు రంగులతో కూడిన జెండాలే. దీంతో ఆయన అనుకోకుండా ఈ ఎమోజీని పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ఎట్టకేలకు తాను పరాగ్వే దేశానికి చెందిన పౌరుడినని రాబర్ట్ వాద్రా ఈ రోజు అంగీకరించారు’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు.
ఇంకో నెటిజన్ మరింత ఘాటైన కామెంట్లు చేశారు. ‘తికమక పడి వాద్రా.. కాంగ్రెస్కి బదులు బీజేపీకి ఓటు వేసి ఉండొచ్చు’ అని మరో నెటిజన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. వెంటనే తప్పును గుర్తించిన వాద్రా పరాగ్వే జెండాను తొలగించి, భారత జెండాను పోస్ట్ చేశారు. అయితే, అప్పటికే నెటిజన్లు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.రాహుల్ బావ తీరును నవ్వుల పాలు చేస్తున్నాయి.