సంచ‌ల‌నంగా మారిన రాయ‌చూర్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని మ‌ధు ప‌త్తార్ మృతి కేసు అనూహ్య మ‌లుపు తిరిగింది. రాయ‌చూర్‌లోని న‌వోద‌య కాలేజ్‌లో ఇంజినీరింగ్ చ‌దువుతుంది మ‌ధు. ఏప్రిల్ 13న విద్యార్థిని అదృశ్య‌మైంది. దీంతో త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 


ఫిర్యాదు చేసిన మూడు రోజుల‌కు అంటే ఏప్రిల్ 16 వ తేదీన విద్యార్థిని మ‌ధు ప‌త్తార్ మృత‌దేహం న‌గ‌రంలోని మాణిక్ ప్ర‌భు టెంపుల్ వ‌ద్ద అనుమానాస్ప‌దంగా క‌నిపించింది. అయితే చెట్టుకు ఉరివేసుకుని కాలిన స్థితిలో మృత‌దేహం ఉంది. ఆ మృత‌దేహాన్ని చూస్తేనే అర్థ‌మ‌వుతోంది ఆమెను చంపేశార‌ని. దీంతో ఆ మృత‌దేహం చూసిన విద్యార్థి, ప్ర‌జా సంఘాలు.. ఆమెను ఎవ‌రో రేప్ చేసి చంపార‌ని ఆరోపించాయి. 


మ‌రోవైపు మృత‌దేహం వ‌ద్ద సూసైడ్ నోటు ల‌భించింది. అందులో త‌న‌కు ఇంజినీరింగ్‌లో బ్యాక్‌లాగ్స్ ఉన్నాయ‌ని.. దీంతో మ‌న‌స్తాపం చెంది జీవితంపై విర‌క్తి చెంది ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్లు ఒక లేఖ‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మ‌ధు మంచి స్టేడెంట్ అని.. ఆమెకు అస‌లు బ్యాక్ లాగ్స్ అనేది తెలియ‌ద‌ని.. ఆవెవీ లేవ‌ని ఫ్రెండ్స్ చెప్పారు. 


ఇది ఖ‌చ్చితంగా అత్యాచారం చేసి చంపార‌ని.. ఈ కేసును పోలీసులు డైవ‌ర్ట్ చేసి ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విద్యార్థి, ప్ర‌జా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇక ఈ కేసు సంచ‌ల‌నం క్రియేట్ చేయ‌డంతో సినీ తార‌లు సైతం ఈ ఘ‌ట‌న‌పై స్పందిస్తున్నారు. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. 


అటు తిరిగి.. ఇటు తిరిగి ఈ కేసు ద‌ర్యాప్తును కాస్త రాష్ట్ర ప్ర‌భుత్వం సీఐడీకి అప్ప‌గించింది. ఈ నేప‌థ్యంలో అధికారులు అన్ని కోణాల్లో ద‌ర్యాప్తు చేప‌ట్టారు. విద్యార్థిని మధు పత్తార్ ప్రియుడు సుదర్శన్ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అత‌డిని రెండు వారాల‌కు పైగా విచారించారు. 
అయితే విద్యార్థిని మ‌ధు ప‌త్తార్ది హ‌త్య కాద‌ని సీఐడీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆ విద్యార్థిని ప్రేమ గొడ‌వ‌ల‌తోనే ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు చెబుతున్నారు సీఐడీ అధికారులు. 


మ‌ధు ప‌త్తార్ మృత‌దేహాన్ని జరిపిన పోస్టుమార్టం వివరాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు సీఐడీ అధికారులు. ఆ నివేదిక ఆధారంగా మధుపై ఎలాంటి అత్యాచారం జరగలేదని, ఆమె ఆత్మహత్య చేసుకుందని సీఐడీ అధికారులు అనధికారంగా చెబుతుండ‌టం గ‌మ‌నార్హం.


మ‌ధు ప్రియుదు సుద‌ర్శ‌న్ యాద‌వ్ నుంచి చాలా విష‌యాల‌ను రాబ‌ట్టింది సీఐడీ. వారిద్ద‌రు 8వ త‌ర‌గ‌తి నుంచి ఇంట‌ర్ వ‌ర‌కు క‌లిసి చ‌దువుకున్నాట్లు సుద‌ర్శ‌న్ విచార‌ణ‌లో తెలిపాడు. ఆ త‌ర్వాత మ‌ధు ప‌త్తార్ ఇంజినీరింగ్‌లో చేర‌గా.. తాను బీకాంలో చేరిన‌ట్లు విచార‌ణ‌లో తెలిపారు సుద‌ర్శ‌న్‌. చ‌దువు వేరైనా ఇద్ద‌రి మ‌ద్య ప్రేమ కొన‌సాగిందని తెలిపాడు. తాజాగా కొన్ని రోజులుగా వారిద్ద‌రి మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయ‌ని చెప్పిన‌ట్లు సీఐడీ అధికారులు తెలిపారు. 


వారిద్ద‌రి మ‌ధ్య జ‌రుగుతున్న గొడ‌వ‌ల‌తోనే మ‌ధు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు సుద‌ర్శ‌న్ యాద‌వ్ చెప్పిన‌ట్లు సీఐడీ అధికారులు తెలిపారు. ఒక‌వైపు సీఐడీ అధికారులు చెబుతున్న వివ‌రాల‌పై అనుమానాలు త‌లెత్తుతున్నాయి. సీఐడీ తీర్మానంపై ఆమె త‌ల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, ప్ర‌జా సంఘాలు ఆగ్ర‌హం వ్య‌క్తి చేస్తున్నాయి. 


ఈ కేసును దారి మ‌ళ్లించేందుకు.. నిందితుల‌ను కాపాడ‌టానికే సీఐడీ ప్ర‌య‌త్నిస్తుంద‌ని ఆరోప‌ణ‌లు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. విద్యార్థిని మ‌ధు ప‌త్తార్‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు త‌మ పోరాటం కొనసాగిస్తామ‌ని చెబుతున్నారు. న్యాయం జ‌ర‌గ‌కపోతే పోరాటం మ‌రింత తీవ్ర‌త‌రంగా ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. నిందితుల‌ను అరెస్ట్ చేసి క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: