ఫలితాలు వెల్లడయ్యే తేది
మే 23 వస్తోందంటే చంద్రబాబునాయుడులో ఎంత టెన్షన్ పెరిగిపోతోందో అర్ధమైపోతోంది.
అంతకన్నా ముందు అంటే మే 19వ తేదీ వెలువడే ఎగ్జిట్ ఫలితాలంటే కూడా అదే టెన్షన్
కనబడుతోంది. అసలు ఎగ్జిట్ పోల్స్ అంటేనే చంద్రబాబు ఎందుకు కంగారు పడుతున్నారో
అర్ధం కావటం లేదు.
క్యాబినెట్ సమావేశంలో సహచరులతో మాట్లాడుతూ ఈనెల 19వ తేదీన వచ్చే ఎగ్జిట్ పోల్స్ చూసి ఎవరూ కంగారుపడద్దంటూ చంద్రబాబు ప్రత్యేకంగా చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. నిజానికి ఫలితాల విషయంలో కానీ ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నా అందరికన్నా ఎక్కువగా ఆందోళన పడుతున్నదే చంద్రబాబు. తాను భయపడుతూ ఎవరూ భయపడొద్దంటూ మంత్రులకు చెప్పటమే విచిత్రంగా ఉంది.
ఎగ్జిట్ పోల్స్ టిడిపికి వ్యతిరేకంగా వచ్చినా ఎవరూ కంగారు పడద్దని చెప్పటంలోనే చంద్రబాబు టెన్షన్ ఏంటో అర్ధమైపోతోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు టిడిపికి వ్యతిరేకంగా వస్తాయని చంద్రబాబు ఎందుకనుకుంటున్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చేది టిడిపినే అని ఒకసారి చెబుతారు. పార్టీకి 150 సీట్లు ఖాయంగా వస్తాయని మరోసారి అంటారు. నిజంగానే టిడిపి అధికారంలోకి వచ్చేంత సీన్ ఉంటే చంద్రబాబు చెబుతున్నట్లు 150 సీట్లు కాకపోయినా అధికారం మళ్ళీ టిడిపిదే అనే వస్తుంది కదా ?
అసలు ఎగ్జిట్ పోల్స్ అంతా టిడిపికి వ్యతిరేకంగానే ఉంటాయని చంద్రబాబు ఎందుకు అనుకుంటున్నారు. పసుపు కుంకుమ, ఫించన్లు, అన్నదాత సుఖీభవ లాంటి సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి వల్లే జనాలు టిడిపికి మళ్ళీ ఓట్లేశారని కదా చంద్రబాబు చెబుతున్నది. అదే నిజమైతే ఎగ్జిట్ పోల్స్ కూడా టిడిపికే అనుకూలంగా రావాలి కదా ?
23న ఫలితాలైన, 19న వెలువడే ఎగ్జిట్ పోల్ ఫలితాలైనా టిడిపికి వ్యతిరేకంగా ఉంటాయనే పార్టీలోని చాలామంది నిర్ణయానికి వచ్చేశారు. చంద్రబాబు ఎన్ని సమీక్షలు చేసినా, ఎన్ని మాయమాటలు చెప్పినా చాలామంది అభ్యర్ధుల్లో గెలుపుపై నమ్మకం కోల్పోయారు. ఆ విషయం ఇప్పటి వరకూ జరిపిన సమీక్షల్లో చంద్రబాబుకు కూడా అర్ధమైపోయింది. కాకపోతే ఏదో దింపుడుకళ్ళెం ఆశతో చంద్రబాబులో ఉన్నట్లు అర్ధమవుతోంది.