విశాఖ నగరం బీచ్ రోడ్డులో గత అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి హరికృష్ణ విగ్రహాలను అధికారులు తొలగించారు. ఈ మూడు విగ్రహాలకు అనుమతి లేదనే కారణంతో పోలీసుల సమక్షంలో జేసీబీల సాయంతో మున్సిపల్ అధికారులు తొలగించారు.
గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి టైమ్లో ఎలాంటి ఉద్రిక్తతలకు చోటుచేసుకోకుండా విగ్రహాల తొలగింపు పనిని ముగించారు. ముందు జాగ్రత్త చర్యగా బీచ్ రోడ్డులో పోలీసులను పెద్ద ఎత్తున మోహరించి.. రోడ్డును బ్లాక్ చేశారు. విగ్రహాలను తొలగించిన తర్వాత వాటిని నిలబెట్టిన ఫ్లాట్ ఫామ్లను కూడా ధ్వంసం చేశారు.
కాగా.. సీనీ రంగానికి ఈ ముగ్గురు ప్రముఖులు చేసిన సేవల్ని కొనియాడుతూ గతేడాది డిసెంబర్లో మంత్రి గంటా శ్రీనివాసరావు చేతులగా మీదుగా విగ్రహాలను ఆవిష్కరించారు. బీచ్ రోడ్డులో విగ్రహాలు ఏర్పాటు చేయాలంటే నగరపాలక సంస్థ అనుమతి తీసుకోవాలి. నిర్వాహకులు పెట్టుకున్న దరఖాస్తును స్టాట్యూ కమిటీ ఆమోందించిన తర్వాతే వాటిని ఏర్పాటు చేసుకోవాలి.
అయితే హరికృష్ణ, అక్కినేని, దాసరి విగ్రహాలను ఎటువంటి అనుమతి లేకుండా అప్పటికప్పుడు హడావుడిగా ఏర్పాటు చేశారు. దీనిపై అప్పట్లో ప్రజా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తంచేశాయి. కార్పొరేషన్ తొలగించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాయి ప్రజాసంఘాలు. కాగా.. ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు అధికారులు వారి విగ్రహాలను తొలగించారు.