ఫోర్జరీ కేసులో ఇరుక్కున్న టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఉదంతం మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఆయన కోసం పోలీసులు వేట ముమ్మరంచేశారు. తాజాగా సైబరాబాద్ పోలీసులు రవిప్రకావ్, శివాజీలపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులను అప్రమత్తం చేశారు.
అలంద మీడియా డైరెక్టర్ కౌశిక్రావు ఫిర్యాదుమేరకు ఈ కేసులో విచారణకు హాజరుకావాలని సైబరాబాద్ పోలీసులు పలు నోటీసులు పంపినప్పటికీ రవిప్రకాశ్ నుంచి ఎలాంటి స్పందనరాలేదు. ఈ కేసులో కీలకం రవిప్రకాశ్ కాబట్టి తొలుత ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, మరోవైపు తగిన ఆధారాలు సేకరిస్తున్నామని పోలీస్ అధికారులు అంటున్నారు.
ఇప్పటికే రెండు సార్లు సీఆర్పీసీ 160 సెక్షన్ కింద, మరోసారి సిఆర్పీసీ 41 ఏ సెక్షన్ కింద విచారణకు హాజరు కావాలని రవి ప్రకాశ్, శివాజీలకు సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో టీవీ9 నిధుల మళ్లింపు, ఫోర్జరీ కేసుల నేపథ్యంలో దేశం విడిచి పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు అన్ని ఎయిర్పోర్టులకు అందించారు. మరోవైపు విచారణకు హాజరు కాకపోవడంతో మూడు బృందాలతో రవి ప్రకాశ్, శివాజీలకోసం పోలీసులు గాలిస్తున్నారు.