తెలుగుదేశం పార్టీకి ఒకే ఒక్క ధీమా ఉంది. అదే లగడపాటి. అయిదేళ్ళ పాటు ప్రజలకు మంచి చేసాం కాబట్టి  గెలుస్తామని అనుకోవడంలేదు. ఎన్నికల ముందు పసుపు కుంకుమ పంచాం కాబట్టి వస్తామని గట్టిగా చెప్పడంలేదు. చంద్రబాబు లాంటి సీనియర్ నేతను తప్ప జనం ఎవరికీ ఓటు వేయరని జబ్బచరచి అనడంలేదు. మరి ఇవి కాకుండా మరేమిటి అంటే లగడపాటి..


ఆయన చేసిన సర్వే ఇపుడు టీడీపీలో ఎక్కడలేని ఉత్సాహం నింపుతోంది. ఇప్పటికే టీడీపీ నేతలందరి వద్ద లగడపాటి సర్వే ఫలితాలు ఉన్నాయని అంటున్నారు. అందుకే గత నెల రోజులుగా పెదవి విప్పవి వారంతా ఇపుడు ఒక్కసారిగా బయటకు వచ్చి మరీ జగన్ని మళ్ళీ తిట్టిపోయడం ప్రారంభించారు. జగన్ని ఎన్నికలకు ముందు ఎలా దబాయించి మాట్లాడారో ఇపుడు అవే పెద్ద గొంతులు చేసుకుంటున్నారు.


ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్, దేవినేని ఉమా మహేశ్వరరావు, బుద్దా వెంకన్న, నక్కా ఆనందబాబు  వంటి వారంతా మళ్ళీ టీడీపీదే విజయం అని గట్టిగా చెబుతున్నారు. మేమే వస్తున్నాం. జగన్ని, విజయసాయిరెడ్డిని జైల్లో పెట్టిస్తామని ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్ అన్నారు. కేసీయార్ పొమ్మంటే జగన్ అమరావతి వస్తున్నారని, మేము ఇక్కడ నుంచి పంపిస్తే లోటస్ పాండ్ కి అటునుంచి జైల్ కి కూడా వెళ్తారని ఆయన హాట్ కామెంట్స్ చేశారు.


ఇక దేవినేని అయితే జగన్ని, ఇతర నాయకులను దారుణంగా విమర్శించారు. జగన్ ఆటలు ఇక సాగవని, ఆయన వూహలకు రోజులు చెల్లాయని, అసలైన ఫలితాలతో జగన్ దిమ్మ దిరిగిపోవడం ఖాయమని ఉమా అంటున్నారు. మే 23న జగన్ ఆరోగ్యాన్ని కుటుంబ సభ్యులు జాగ్రత్తగా చూసుకోవాలని, గత ఎన్నికల్లో ఓటమికి జగన్ టీవీ సెట్టుని పగులగొట్టాడని, ఈసారి ఆయన ఏం పగలగొడతారోనని దేవినేని అనడం విశేషం. మొత్తానికి లగడపాటి సర్వే చేతిలో పడగానే తమ్ముళ్ళకు ఎక్కడలేని హుషార్ వచ్చిపడింది. అందులో టీడీపీకి 120 అసెంబ్లీ, 15కి తగ్గకుండా ఎంపీ సీట్లు ఆయన ఇచ్చారు. సరే ఇందంతా బాగానే ఉంది. లగడపాటి దేవుడు కాదు, ఆయన సర్వేలు కూడా తప్పుతున్నాయి. మరి ఏదైనా తేడా కొట్టి జగన్ అధికారంలోకి వస్తే రెచ్చిపోతున్న తమ్ముళ్ళ పరిస్థితి ఏంటో.


మరింత సమాచారం తెలుసుకోండి: