దేశ్యాప్తంగా అనేక రకాలైన సర్వేలు విడుదలై...ఆయా పార్టీలకు అధికారం దక్కే అంశంపై ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే దేశంలో..రాష్ట్రంలో వైసీపీది అధికారమని తేల్చారు. అయితే, దీనికి పోటీగా తెలుగుదేశం పార్టీ నేతలు ఇంకో సర్వేను తెరమీదకు తెచ్చారు. విజయవాడకు చెందిన ఓ యూకేజీ విద్యార్థి ఒక్కడే ఏకంగా ఎన్నికల సర్వే చేసేశాడని, ఆయన టీడీపీ గెలుపును ప్రకటించాడని వైరల్ చేస్తున్నారు.
షేక్ నహీద్ అనే బాలుడు తన అంచనా ప్రకారం టీడీపీదే మళ్లీ అధికారం అని ప్రకటించాడు. టీడీపీకి మ్యాజిక్ ఫిగర్ కంటే 5 నుంచి 15 సీట్లు ఎక్కువగానే వస్తాయని, వైసీపీకి 63 నుంచి 72 సీట్లు వస్తాయని.. జనసేన 8 సీట్లు గెలుచుకుంటుందని తన సర్వే ద్వారా బయటపడిందని షేక్ నహీద్ చెప్పాడు. ఇంతకీ ఈ అబ్బాయి ఎవరటే..విజయవాడలోని డ్రెయిన్ వీధికి చెందిన నహీద్ కొత్తపేటలోని కూరపాటి హైస్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. ఇతని తండ్రి షేక్ ఇమ్రాన్ది ఐరన్ వ్యాపారం. ఎన్నికల ముందు తండ్రితో కలిసి వివిధ ప్రాంతాలకు వెళ్లే సమయంలో నహీద్.. అక్కడి ప్రజలతో మాట్లాడాడట. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై అభిప్రాయాలనడిగి బుక్లో నోట్ చేసుకున్నాడట. వీటి ఆధారంగానే.. టీడీపీ అధికారం అని చెప్తున్నాడు.
అయితే, సర్వేలు సహజంగానే పెద్ద ప్రక్రియ. వందలాది మంది సిబ్బంది ఓ ప్రశ్నావళి రూపొందించి ప్రజల్లోకి వెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత, అభ్యర్థులు ఖరారైనప్పుడు, పోలింగ్కు వారం ముందు, పోలింగ్ ముగిశాక.. ఇలా దశల వారీగా సర్వే నిర్వహిస్తారు. ఒక్కరితో సాధ్యమయ్యే పనైతే కానే కాదు. కానీ యూకేజీ విద్యార్థి సర్వే అని ప్రకటించడం, దాన్ని టీడీపీ నేతలు వైరల్ చేయడం చిత్రంగా ఉందంటున్నారు.