విపక్షాలకు షాకిచ్చేలా...స్వతంత్రంగా పనిచేస్తున్న రాజ్యాంగబద్ద సంస్థ అయిన ఎన్నికల కమిషన్పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు కురిపించారు. అత్యంత సమర్థవంతంగా లోక్సభ ఎన్నికలు నిర్వహించినట్లు ఆయన ఈసీ అధికారులను మెచ్చుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వ వ్యవస్థలన్నీ అద్భుతంగా ఉన్నాయని, ఎన్నో ఏళ్ల శ్రమతో వాటిని పకడ్బందీగా తయారు చేశామని ప్రణబ్ తెలిపారు.
ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేయాలనుకుంటే, మన దేశంలో వ్యవస్థలన్నీ సమర్థంగా పనిచేస్తున్నాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రణబ్ అన్నారు. ఎన్నికల సంఘం అధికారులు సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించడం వల్ల మన ప్రజాస్వామ్యం విజయవంతమైందన్నారు. ఎన్నికల కమీషనర్ సుకుమార్ సేన్ నుంచి నేటీ వరకు ఆ పదవిలో ఉన్న ప్రతి ఒక్కరు ఎన్నికల నిర్వహణను పటిష్టంగా చేపట్టారన్నారు. వాళ్లను విమర్శించలేమని, చాలా పర్ఫెక్ట్గా ఎన్నికలు నిర్వహించారని ప్రణబ్ కితాబు ఇచ్చారు.
దేశ జనాభాలో రెండు వంతుల ప్రజలు ఓటింగ్ ప్రక్రియలో భాగస్వాములయ్యారు.. చాలా సంవత్సరాల తర్వాత నేను కూడా ఓటు వేశాను... వీటన్నింటి వెనుక ఎన్నికల సంఘం కృషి ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఇక ఎన్నికల కమిషనర్లు అందరినీ ప్రభుత్వాలే నియమిస్తూ వచ్చాయని.. ఎన్నికల కమిషనర్లపై ఆరోపణలు చేస్తున్నవారిపై సెటైర్లు వేశారు. చెడ్డ కార్మికుడు మాత్రమే పనిముట్లతో గొడవ పడతాడు.. మంచి కార్మికుడు పనిముట్లను సజావుగా ఉపయోగిస్తాడంటూ.. ఎన్నికల సంఘంపై విమర్శలు చేస్తున్న నాయకులకు చురకలంటించారు. తద్వారా ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పరోక్షంగా షాకిచ్చినట్లు అయింది.