దాదాపుగా 40 రోజులుగా అన్ని పార్టీలు ఎదురుచూస్తున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. హోరాహోరీగా సాగిన పోరులో గెలిచేదెవరో ఇప్పటికే ఎగ్జిట్పోల్స్ ఒకింత క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో అందరి దృష్టి ఉన్న వైసీపీ ఈ ఫలితాల సరళిని ప్రత్యేకంగా అధ్యయనం చేస్తోంది. ఎన్నికల కౌంటింగ్ సరళిని వైసీపీ నేతలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అమరావతిలోని వైసీపీ కార్యాలయంతో పాటుగా...జగన్ నివాసంలోనూ ఈ మేరకు ప్రత్యేక పరిశీలనలు కొనసాగుతున్నాయి.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నివాసంలో వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎన్నికల సరళిని పరిశీలిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ వార్ రూమ్ను ఏర్పాటు చేసింది. ప్రశాంత్ కిశోర్కు చెందిన పీఏసీ బృందం ఫలితాలను విశ్లేషిస్తోంది. కాగా, ఎన్నికలు కౌంటింగ్ రసవత్తరంగా సాగబోతున్నది. ఎవరు ఎవరికీ మెజారిటీ వస్తుంది.. ఎవరు గెలుస్తుంది అనే విషయాలు మధ్యాహ్నం 2 గంటల తరువాత వచ్చే అవకాశం ఉంది.
ఇదిలాఉండగా, ఫలితాలు గురువారం విడుదల కానున్న నేపథ్యంలో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం వద్ద ప్రస్తుతం సందడి నెలకొంది. వివిధ జిల్లాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. మరోవైపు, ఎన్నికల ఫలితాలను వీక్షించేందుకు గాను సీఎం నివాసంలోని మీడియా పాయింట్ వద్ద ఎల్ఈడీ తెరను ఏర్పాటు చేశారు. నాయకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేపట్టారు.