కర్ణాటకలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ తో పొత్తుపెట్టుకొని విజయం సాధించింది. ఈ పొత్తులో భాగంగా జేడీఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. కాగా ఇప్పుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్, జేడీఎస్ లు ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 28 స్థానాలకు గాను 25 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం చూపుతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటె, ఇక్కడ మాండ్యా నిజయోజక వర్గం చాలా కీలకమైన నియోజక వర్గం. గతమూడు పర్యాయాలు అక్కడ నుంచి అంబరీష్ పోటీ చేసి గెలుపొందుతూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అంబరీష్ మరణించడంతో... ఆయన సతీమణి సుమలత పోటీలో దిగారు. అయితే, పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆ సీటును జేడీఎస్ కు కేటాయించింది. దీంతో అక్కడి నుంచి జేడీఎస్ అభ్యర్థి కుమార స్వామి కుమారుడు నిఖిల్ గౌడను బరిలోకి దించింది.
కాగా, సుమలత ఇండిపెండెంట్ గా పోటీలో దిగారు. సుమలత పోటీలో దిగడంతో బీజేపీ తమ పార్టీ అభ్యర్థిని పోటీకి దించకుండా ఆమెకు మద్దతు ఇచ్చారు. బీజేపీ మద్దతుతో సుమలత నిఖిల్ గౌడపై విజయం సాధించింది. కన్నడ సినీ ప్రముఖులు సైతం ఆమెకు అండగా నిలబడటం విశేషం. ఇదిలా ఉంటె బెంగళూరు సెంట్రల్ నుంచి పోటీ చేసిన నటుడు ప్రకాష్ రాజ్ దారుణంగా పరాజయం పాలయ్యాడు. ఇక్కడ బీజేపీ విజయం సాధించింది. ఆప్ మద్దతు ఇచ్చినా ప్రకాష్ రాజ్ గెలవలేకపోవడం విశేషం.