ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న వైసీపీ అధినేత‌, ఏపీ కాబోయే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర‌ మోదీతో భేటీ అయిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఈనెల 30 న ఒక్కడిగానే ప్రమాణ స్వీకారం చేస్తాన‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. పది, పదిహేను రోజుల్లో పూర్తి స్థాయి మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని స్ప‌ష్టం చేశారు. ఏపీ రాష్ట్రంలోని పరిస్థితులపై ప్రధానితో చర్చించాన‌ని వెల్ల‌డించారు. కేంద్ర సాయం ప్రస్తుతం రాష్ట్రానికి అవసరమ‌ని స్ప‌ష్టం చేశారు. ప్రధానిని ఎప్పుడు కలిసినా ప్రత్యేక హోదాను అడుగుతూనే ఉంటా అని జ‌గ‌న్ త‌న వైఖ‌రిని తేల్చిచెప్పారు.


ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఓవర్‌ డ్రాఫ్ట్‌పై బతకాల్సిన పరిస్థితులు ఉన్నాయని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ``విశ్వసనీయతకు ప్రజలు పట్టం గట్టారు. విశ్వసనీయత సన్నగిల్లకుండా పాలన కొనసాగిస్తాం. మేనిఫెస్టోలో ఉన్న అంశాలను అమలయ్యేలా చూస్తాం.  కేంద్రంపై ఇంతగా ఆధారపడాల్సిన పరిస్థితులు ఎప్పుడూ రాలేదు. రాష్ర్టాన్ని బాగా నడపాలనే తపన నాకు ఉంది. రాష్ర్టానికి చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రాష్ట్రం విడిపోయే నాటికి రూ.97వేల కోట్లు అప్పులు ఉంటే.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రూ.2లక్షల 57వేల కోట్లకు అప్పలు చేరాయి. మద్యపాన నిషేధంపై ఇప్పటికే స్పష్టంగా చెప్పాం. దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తాం. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తాను.`` అని స్ప‌ష్టం చేశారు.  


ఎన్డీఏ బలం 250 దాటకూడదని చాలాగా దేవుణ్ని ప్రార్థించాన‌ని జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్డీఏ 250 స్థానాలకే పరితమై ఉంటే బాగుండేద‌ని జ‌గ‌న్ అన్నారు. `` ఎన్డీఏకి పూర్తి బలం రాకుండి ఉంటే ప్రత్యేక హోదాపై సంతకం పెట్టాకే ప్రధానిగా మోడి ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి ఉండేది. ప్రత్యేక హోదా మన హక్కు, ఈ హక్కును ఇప్పుడు వదిలేస్తే ఎప్పటికి రాదు. ప్ర‌ధానిని కలిసిన ప్రతిసారి ప్రత్యేక హోదాపై ప్రధాని ని కోరుతూనే ఉంటాను. ప్ర‌త్యేక హోదా అనే ఒక్క అంశంపైనే ప్ర‌ధాన‌మంత్రితో సుదీర్ఘంగా చర్చ జరిగింది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలనే ఆతృత ఉంది. పోలవరం నిర్మాణం కేంద్ర బాధ్యత, అంతకు ముందు, పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రజలకు అవసరం. పోలవరం నిర్మాణంపై పూర్తి స్థాయి దృష్టి సారిస్తా
`` అని జ‌గ‌న్ పేర్కొన్నారు.


చంద్రబాబు చేసిన స్కాంలు అనేకమ‌ని, ఒక్కొక్కటిగా బాబు స్కాంలను వెలికి తీస్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ``తెలంగాణ సీఎంకేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటి అయ్యాను. రెండు రాష్ట్రాల మధ్య తొలిసారి స్నేహ బంధం బలపడింది. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉండాలి, అందులో ముఖ్యమైన తెలుగు రాష్ట్రం తెలంగాణ తో స్నేహ బంధం అవసరం. సీఎం కేసీఆర్ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కి తానే ఒక అడుగు ముందుకేసి మాకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. విభజన చట్టంలోని హామీలను కలిసి సాధిద్దామని పెద్దాయన(సిఎం కేసీఆర్) ముందుకు వచ్చారు. ప్రత్యేక హోదాపై పార్లమెంటు లో టీఆర్ఎస్ ఎంపీలు మీతో ఉంటారని పెద్దాయన స్పష్టం చేశారు. ఏపీలో 22, తెలంగాణ 9, మొత్తం 31మంది ఎంపీలం ఒకరి కోసం ఒకరి ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కి ఇద్దరం సీఎం లం కలిసి పని చేస్తాం`` అని ప్ర‌క‌టించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: