తెలంగాణలో విడుదలైన ఇంటర్ ఫలితాల విషయంలో బోర్డ్ నిర్వాకంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటర్ బోర్డ్ అవకతవకలు వ్యవహారం లో హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఇంటర్ రీ వేరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాల రిపోర్టును కోర్టుకి ఇంటర్ బోర్డ్ సమర్పించింది. రీ కౌంటింగ్ , రీ వేరిఫికేషన్పై ఇంకా 8 వేల మంది విద్యార్థుల వినతులు పెండింగ్ లో ఉన్నాయి అంటూ కోర్ట్ దృష్టికి పిటిషనర్ తీసుకెళ్లారు. రీ వేరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాలు అన్ని పూర్తి చేశామని ఇంటర్ బోర్డ్ ఈ సందర్భంగా పేర్కొంది.
ఆత్మహత్య చేసుకున్న 26 మంది విద్యార్థులు ఎవరు ఈ ఫలితాల్లో పాస్ కాలేదని ఇంటర్ బోర్డ్ తన రిపోర్టులో పేర్కొంది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల జవాబు పత్రాలను సిద్ధంగా ఉంచాలని బోర్డుకి హైకోర్టు ఆదేశాల్చింది. ఆత్మహత్య చేసుకున్న అనామిక అనే విద్యార్థిని రాసిన మూడు పరీక్షలు పాస్ అయ్యిందని బోర్డ్ పేర్కొంది. చనిపోయిన 23 మంది విద్యార్థుల్లో ముగ్గురు విద్యార్థులు గతంలో పాస్ అయినట్లు రిపోర్టులో ఇంటర్ బోర్డ్ పేర్కొంది. రీ వేరిఫికేషన్, రీ వ్యాల్యూషన్ లో మరోసారి ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యం వహించిందని కోర్టుకి పిటిషనర్ తరుపు న్యాయవాది తెలిపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు సోమవారం ప్రభుత్వం, పిటిషనర్ మరోసారి అఫిడవిట్ ధాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
కాగా, గతంలోనూ తెలంగాణ ఇంటర్ ఫలితాల వ్యవహారంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దని ఘాటుగా స్పందించింది. ఫెయిల్ అయిన 3 లక్షల మంది విద్యార్థుల రీ-వాల్యుయేషన్పై నిర్ణయాన్ని తెలపాలని ఇంటర్ బోర్డును ఆదేశించింది. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టింది కోర్టు.. ఇంటర్ ఫలితాలలో వచ్చిన ఆరోపణలపై త్రిసభ్య కమిటీ వేశామని ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు అడిషనల్ ఏజీ రామచందర్రావు. అయితే, ఈ ఏడాది 9.70 లక్షల మంది విద్యార్థుల పరీక్ష రాశారని.. ఇప్పటి వరకు 16 మంది విద్యార్థులు చనిపోయారని.. అయినా, ఇప్పటి వరకు ఇంటర్ బోర్డ్ స్పందించడం లేదన్న పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఇంటర్ ఫలితాలపై జరిగిన అవకతవకలపై జ్యూడిషియల్ ఎంక్విరీ జరిపించాలని కోర్టును కోరారు.