వైఎస్ జగన్ లో అన్న నందమూరి తారకరామారావు పోలికలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆయనలా జనం కోసమే తపన పడడం. తనకు రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా జనాన్నే నమ్ముకోవడం, వారి మీద అపరిమితమైన విశ్వాసాన్ని చాటడం వంటివి నిజంగా జగన్, అన్న గారు ఒకే రూట్ అనిపించేలా చేస్తాయి.
ఇక జగన్ గత రెండేళ్ళుగా అసెంబ్లీ ముఖం చూడడం మానేశారు. గత అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆయన సభలో అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పడం మానేసి విమర్శలు చేయడం, వ్యక్తిగతంగా దూషించడం వంటివి చేసేది. దాంతో విసుగు చెందిన జగన్ ఈ సభకు ఓ నమస్కారం జనంలోనే తేల్చుకుంటాను, వారే నా అసెంబ్లీ అంటూ పాదయాత్రకు వెళ్ళిపోయారు. అలా రెండేళ్ళుగా ఆయన పాదయాత్ర చేస్తూనే గడిపారు.
ఈ మధ్యలో బడ్జెట్ సెషన్లు, ఇతర సమావేశాలు పలుమార్లు జరిగాయి. అయినా జగన్ వెళ్ళలేదు. జనం జగన్ కి జరిగిన అవమానాన్ని గుర్తించి ఆయన్ని ఈసారి అసెంబ్లీకి ముఖ్యమంత్రిగానే పంపుతున్నారు. దాంతో జగన్ ఇపుడు దర్జాగా స్పీకర్ కి కుడివైపు ద్వారం గుండా అసెంబ్లీలోకి ప్రవేశిస్తారన్నమాట. ఓ విధంగా జగన్ తన అప్రకటిత శపధం నెరవేర్చుకున్నట్లే. కొందరికే సాధ్యపడిన విజయం ఇది.
ఇక అప్పట్లో అంటే 1993 ప్రాంతంలో అన్న గారు కూడా కాంగ్రెస్ నేతల అవమానాలు, కువిమర్శలు పడలేక అసెంబ్లీకి రాను పొమ్మన్నారు తిరిగి ఆయన 1994 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన తరువాంతే అసెంబ్లీకి ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు. తాజా ఎన్నికల్లో జగన్ సైతం భారీ మెజారిటీతో గెలవడం చూస్తూంటే అన్న గారి పోలికలు బాగానే కనిపిస్తున్నాయని అంటున్నారు.