ఉద్యోగం ఊడిపోయింది..ఓటమి మిగిలిపోయింది..ఎందుకిలా నా ఖర్మ కాలిపోయింది అంటూ...ఇప్పుడు టీడీపీ నేతలు పాటపాడుకుంటున్నారు..సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి తెలుగు తమ్ముళ్లు బయటపడలేకపోతున్నారు..పరువు, డబ్బు పోయిందని లబోదిబోమంటూ ఇంట్లో నుంచి బయటరాలేకపోతున్న టీడీపీ నేతలు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి.. సమీక్షలు చేసుకుంటూ..ఎందుకిలా జరిగిందంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించుకునేందుకు ఆదివారం పాయకరావుపేటలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశానికి ముఖ్య నాయకులు డుమ్మా కొట్టారు. 


పరవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పరిశీలకునిగా నిర్వహించిన ఈ సమావేశానికి ఒకరిద్దరు నాయకుల మినహా నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. జాతీయ రహదారి పక్కన పీఎల్‌పురం సమీపంలోని ద్వారకా హోటల్‌లో నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ఈ సమావేశానికి పట్టుమని 100 మంది కూడా రాకపోవడంతో సమావేశం బోసిపోయింది. చోటామోటా నాయకులతోనే ఈ సమావేశాన్ని మమ అనిపించారు. పార్టీ ముఖ్యనాయకులు చెబుతున్నట్లుగా ఈ ఎన్నికల్లో టీడీపి ఓటమికి ఈవీఎంలు కారణం కాదని, పార్టీలో ఐకమత్యం లేకపోవడమేనని ఎస్‌రాయవరం మండలానికి చెందిన తుంపాల నాగేశ్వరరావు అనే నాయకుడు సభలో వ్యాఖ్యానించడం చర్చనీయాంశమయింది. మనలో లోపాలను ఈవీఎంలపై నెట్టడం సరికాదని నాయకులు బహిరంగంగా వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఈవీయంలపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని స్వయంగా తెలుగు తమ్ముళ్లే అధినేతను తప్పు పడుతున్నారు.


 ఇక ఈ సమీక్షలో పాయకరావుపేట టీడీపీ అభ్యర్థి బంగారయ్య ఉద్యోగం పోయింది..ఓటమి మిగిలిదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అభ్యర్థి బంగారయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని ఎమ్మెల్యే అవుదామన్న ఆశతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. పాయకరావుపేట టీడీపీకి కంచుకోట అని భావించానని విజయం తథ్యమని ఆశపడ్డానన్నారు. ఉన్న ఉద్యోగం పోయి.. ఆశలు ఆవిరయ్యాయని. ఎన్నికల్లో ఓటమి పాలయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా పూర్తిస్థాయిలో రాజకీయాల్లో కొనసాగుతానని, కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు. దీంతో బంగారయ్యపై టీడీపీ కార్యకర్తలు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పదవుల కోసం బంగారంలాంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని బంగారయ్య తప్పు చేశారని, అయ్యో పాపం బంగారయ్య అంటూ తెలుగు తమ్ముళ్లు జాలిపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: