తెలుగుదేశం పార్టీ నేతలు చేసే ప్రచారం ఎంత చిత్రంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాము ఏం చెప్పినా...అదే నిజమని...దాన్నే నమ్మాలనే భావన సదరు నేతల్లో ఉంటుంది. తాజాగా అదే తరహా ప్రచారాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చారు. అదే గన్నవరం విమానాశ్రయంలో తనిఖీల గురించి. శుక్రవారం సాయంత్రం విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరేందుకు ఆయన గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ భద్రతా సిబ్బంది చంద్రబాబును తనిఖీ చేశారు. ఆయన వాహనం నేరుగా వీఐపీ మార్గం నుంచి విమానం వరకు వెళ్లే వెసులుబాటు ఉంది. అయితే, చంద్రబాబును సాధారణ ప్రయాణికులు వెళ్లేమార్గంలో పంపిస్తూ తనిఖీలు చేశారు. విమానాశ్రయంలో లాంజ్ నుండి విమానం వరకూ ప్రత్యేక వీఐపీ వాహనం కేటాయించకుండా అందరూ వెళ్లే బస్సులోనే పంపించారు. వీఐపీ, జడ్ ప్లస్ భద్రతలో ఉన్న చంద్రబాబుకు ప్రత్యేక వాహనం కేటాయించకపోవటం పట్ల టీడీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
అయితే, దీనిపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతల ప్రచార ఆర్భాటం కోసం ప్రయాణికుల భద్రతను పణంగా పెడుతున్నారని అంటున్నారు. చంద్రబాబు వెళ్లేది పాసింజర్ ఫ్లైట్లో అని పేర్కొంటూ అది స్పెషల్ ఫ్లైట్ కాదని స్పష్టం చేస్తున్నారు. పాసింజర్ ఫ్లైట్లలో వీఐపీ ట్రీట్మెంట్ ఉండదని, కోరుకోవడం కూడా తప్పేనని స్పష్టం చేస్తున్నారు. తోటి ప్రయాణికుల భద్రత కోసం సెక్యూరిటీ సిబ్బందికి సహకరించడం పరిణితి అనిపించుకుంటుందని బాబు తనిఖీల పట్ల జరుగుతున్న ప్రచారంపై ఘాటుగా రియాక్టవుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో పనిచేసినంత మాత్రాన చట్టాలకు, నిబంధనలకు అతీతులు కారని స్పష్టం చేస్తున్నారు. దివంగత సుప్రసిద్ధ రాష్ట్రపతి అబ్ధుల్ కలాం కూడా తన రాష్టపతి పదవికాలం పూర్తి అయ్యాక విమానయాన సంస్థలు తనిఖీలు నిర్వహించాయని గుర్తు చేస్తున్నారు. తనిఖీల విషయంలో టీడీపీ రచ్చను చూస్తుంటే...అబ్దుల్ కలాం కంటే చంద్రబాబే గ్రేట్ అనుకోవాలని పలువురు సెటైర్లు వేస్తున్నారు.