ఒక రోజు పర్యటన నిమిత్తం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విజయవాడ చేరుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. ఏపీ నూతన రాజధాని అమరావతిలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్తో కేసీఆర్ సమావేశమయ్యారు. కేసీఆర్కు ఘనస్వాగతం పలికిన జగన్.. ఆయనను సాదరంగా లోనికి తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను జగన్కు కేసీఆర్ అందజేశారు. అనంతరం దాదాపు గంటన్నరపాటు ఇద్దరు సీఎంలు విభజన సమస్యలు సహా వివిధ అంశాలపై చర్చలు జరిపినట్టు సమాచారం.
అయితే, విజయవాడలో కేసీఆర్ పర్యటన సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తొలుత బెజవాడ కనకదుర్గమ్మను ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ఏపీ పంచాయతీరాజ్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు కేసీఆర్కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, ఆహ్వాన పత్రికను అమ్మవారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలుచేశారు. అనంతరం అర్చకస్వాములు కేసీఆర్కు ఆశీర్వచనాలు ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి చిత్రపటాన్ని ఆలయ అధికారులు బహూకరించారు. దాదాపు అరగంటపాటు కేసీఆర్ ఆలయంలో గడిపారు. అక్కడినుంచి తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మార్గమధ్యంలో ప్రకాశం బరాజ్ వద్ద కాసేపు కారు నిలిపి, అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించారు. బరాజ్ కట్టిన తీరును, నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. నదిలోకి నాణేలు వదిలారు. కేసీఆర్ చర్య పలువురిలో ఆసక్తిని రేకెత్తించింది.
కాగా, కేసీఆర్-జగన్ల మధ్య వివిధ అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రెండు రాష్ర్టాల మధ్య జలవివాదాలు ఉండొద్దని నిర్ణయించినట్టు తెలిసింది. హైదరాబాద్లో తమ ఆధీనంలో ఉన్న భవనాలను తెలంగాణకు అప్పగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తికావచ్చింది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనపై ఇద్దరు సీఎంలు చర్చించినట్టు సమాచారం. ప్రభుత్వరంగసంస్థల విభజనపై దృష్టిపెట్టడంతోపాటు.. విద్యుత్ ఉద్యోగుల విభజనపైనా చర్చించినట్టు తెలిసింది. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై సమాలోచనలు జరిపిన సీఎంలు.. కృష్ణా, గోదావరి జలాలపై కోర్టులు, ట్రిబ్యునళ్లకు వెళ్లేందుకు ఆస్కారం లేకుండా అన్ని సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామని నిర్ణయించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈ నెల 24న హైదరాబాద్లో ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శుల సమావేశం జరుగనుంది.