``ఢిల్లీలో చక్రం తిప్పేస్తా...దేశంలో నాకంంటే సీనియర్ ఎవరు? ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూడగడుతా. మోదీని గద్దె దింపుతా...`` ఈ గర్జనలు...మాటలు...ప్రకటనలు..సొంత డబ్బా ఎవరిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో...చేసిన వ్యాఖ్యలు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ తరహా కామెంట్లు చేసిన బాబు ఇప్పుడు ఢిల్లీకి మొహం చూపేందుకు కూడా ఇష్టపడటం లేదంటున్నారు. అదే సమయంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్...తన సత్తాను చర్యల రూపంలో చాటుకుంటున్నారని పలువురు పేర్కొంటున్నారు.
ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనే అంశంపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోదీ బుధవారం పలు రాజకీయ పక్షాల నేతలను కలుసుకున్నారు. జమిలి ఎన్నికలతోపాటు, ఈ ఏడాది జరుగనున్న మహాత్మాగాంధీ 150వ జయంతి, 2022లో జరుగనున్న భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాలపై ఆయన వారితో చర్చలు జరిపారు. పార్లమెంట్ ఉభయసభల్లో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీల అధ్యక్షులను ప్రధాని ఈ సమావేశానికి ఆహ్వానించారు. అఖిలపక్ష భేటీలో జమిలి ఎన్నికల ప్రతిపాదనకు టీఆర్ఎస్, బీజేడీ సహా పలు పార్టీలు మద్దతు తెలిపాయి. కాగా కాంగ్రెస్, తృణమూల్, బీఎస్పీ, ఎస్పీ, డీఎంకే వంటి పలు ప్రధాన పార్టీలు ఈ సమావేశానికి గైర్హాజరయ్యాయి. ఈ సమావేశంలో పాల్గొన్న వామపక్షాలు జమిలి ప్రతిపాదనను వ్యతిరేకించనప్పటికీ, ఎన్నికలు ఎలా నిర్వహిస్తారన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి.అయితే, దేశంలోనే సీనియర్ అని డబ్బా కొట్టుకునే చంద్రబాబు...ఈ కీలక సమావేశానికి దూరంగా ఉండిపోయారు.
మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. తాము జమిలీ ఎన్నికలను ఎందుకు సమర్థిస్తున్నామో వివరించారు. వ్యతిరేకించదగిన అంశాలను సైతం ఆయన ప్రస్తవించారు. రాజకీయ వ్యవస్థలో రావాల్సిన మార్పులను ప్రస్తావించారు. ఇలా...మొదటి సారి ముఖ్యమంత్రి, పదేళ్ల పార్టీకి నాయకుడు అయిన జగన్ తన భావాలను స్పష్టంగా వ్యక్తీకరించి హిమాలయాల అంతటి ఎత్తుకు చేరుకుంటే...తన కంటే దేశంలోనే సీనియర్ లేడని చెప్పుకొనే నాయకుడు డుమ్మా కొట్టి అథఃపాతాళానికి చేరిపోయారని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.