ఇది సోషల్ మీడియా యుగం. రాజకీయ నాయకుల బుర్రల్లో పది సినిమాలు ఆడితే సొషల్ మీడియా జనంలో ఒక్కొక్కరూ వంద సినిమాలు ఆడిస్తారు. ఆవలించకుండానే పేగులు లెక్కేట్టేస్తారు. తాటి చెట్టు కిందన కూర్చుని పాలు తాగుతనంటే నమ్మే రోజులు పోయాయి. ఏపీలో ఫిరాయింపులతో గత అయిదేళ్ళు గబ్బు కొట్టించిన టీడీపీ ఇపుడు రివర్స్ ఫిరాయింపులకు తెర తీసినట్లుగా ప్రచారం సాగుతోంది.


బాబుకు నమ్మకమైన శిష్యుడుగా పేరు తెచ్చుకున్న సుజనా చౌదరి బీజేపీలోకి జంప్ అయిపోయారు. ఆ పార్టీ ఆఫీస్ నుంచి మాట్లాడిన సుజనా టీడీపీ ఏపీలో పుంజుకోవాలని ఆకాక్షించారు. ఆ మాటలు విన్న కమలనాధులకు బుర్ర తిరగాల్సిందే మరి. ఏ నేత అయినా తమ పార్టీలోకి వస్తే బలం పెరుగుతుంది. తాము పటిష్టం కావాలని కోరుకుంటారు. బీజేపీలోకి వచ్చినా కూడా సుజనా నీ సుఖమే నే కోరుతున్నా అంటూ బాబోరి పాటే పాడుతున్నారు.


ఏపీలో టీడీపీ బాగుపడితే మరి బీజేపీలోకి సుజనా బ్యాచ్ చేరడం ఎందుకో మరి. అంటే టీడీపీ బాగు కోసం, మేలు కోసమే తాము ఫిరాయించామని ఈ శిష్య మానవుడు చెప్పకనే చెబుతున్నాడనుకోవాలి. ఇక ఎప్పటికీ చంద్రబాబే తన రాజకీయ గురువు అంటూ సుజనా మాట్లాడిన తీరు చూసిన వారికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పొస్టింగులు గుర్తుకు రాక మానవు. ఈ మొత్తం ఆపరేషన్ చంద్రబాబే దగ్గరుండి చేయించారన్న దానికి సుజనా చిలక‌ పలుకులే సాక్ష్యం.  మరి ఇలాంటి తమ్ముళ్లను తెచ్చుకున్నందుకు బీజేపీ ఏపీలో ఏం బావుకుంటుందో కాలమే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: