అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా...ప్రపంచవ్యాప్తంగా యోగా సంబంధిత కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ చొరవతో భారతీయ యోగాకు అంతర్జాతీయ గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. 2015 నుంచి ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. సినీ సెలబ్రిటీలు పలు విన్యాసాలు చేస్తూ ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శిల్పా శెట్టి కుంద్రా, మలైకా అరోరాలు ఫిట్ నెస్ కోసం ఎల్లప్పుడు యోగా చేస్తూనే ఉంటారు. బిపాసా బసు, అనుపమ్ కేర్, సోనాల్ చౌహన్, వివేక్ ఒబేరాయ్ అభిమానులని ఉత్తేజ పరిచే పోస్ట్లని షేర్ చేస్తూ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అయితే, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఆయన చేసిన పోస్టు దానికి ఆయన ఇచ్చిన క్యాప్షన్ చదివితే... రాహుల్ మతిపోయిందా అన్న అనుమానం కలుగుతోంది. ప్రపంచం అంతా యోగా డే నిర్వహిస్తుంటే.. రాహుల్ మాత్రం ఆర్మీ డాగ్ యూనిట్ చేసిన యోగాను తన ట్వీట్లో పోస్టు చేశారు. అక్కడితో ఆగకుండా దానికి న్యూ ఇండియా అని ట్యాగ్ ఇచ్చారు. నవ భారతం అంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆర్మీ డాగ్ యూనిట్ ఇవాళ యోగా డేలో పాల్గొన్నది. ఆర్మీ వద్ద ఉన్న శునకాలు కూడా యోగా చేశాయి. వాటి ముందు జవాన్లూ ఆ ఫోజులు ఇచ్చారు. దీన్ని రాహుల్ పోస్టు చేసిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటు నెటిజన్లు అటు వివిధ పార్టీల నేతలు ఘాటుగా స్పందించారు. భారతీయ సంస్కృతిని రాహుల్ ఎద్దేవా చేశారంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. బీజేపీ నేత సంబిత్ పాత్ర .. రాహుల్ ట్వీట్ను తప్పుపట్టారు. అవి శునకాలే అయినా.. అవి కూడా దేశ సేవ చేస్తున్నాయన్నారు. ఇక పరేశ్ రావల్ కూడా మరో కామెంట్ చేశారు. ఇది న్యూ ఇండియానే, కానీ మీకంటే శునకాలే స్మార్ట్ అంటూ ఆయన ఘాటుగా రియాక్ట్ అయ్యారు.