జల వివాదాలపై చర్చించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్​, జగన్​లు ఈ నెల 27న సమావేశం కావాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమావేశం అమరావతిలో ఏర్పాటు చేయాలని అనుకొన్నా... ఎక్కడ, ఎన్ని గంటలకనేది ఇంకా ఖరారు కావాల్సి ఉందని నీటి పారుదల శాఖ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. 


ఇరు రాష్ట్రాల అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. బ్రిజేష్​కుమార్​ ట్రైబ్యునల్​, కృష్ణా, గోదావరి బోర్డులకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇద్దరు సీఎంలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో జల వివాదాలు పరిష్కరించుకుంటే రెండు రాష్ట్రాలూ ప్రయోజనం పొందుతాయనే అభిప్రాయంతో ఉన్నారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​కు బచావత్​ ట్రైబ్యునల్​ 811 టీఎంసీలు కేటాయించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్​ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు వాడుకొంటున్నాయి. పునర్విభజన సమయంలో రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టుల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ లెక్కను నిద్ధరించారు.
ప్రస్తుతం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపు, తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు వినియోగం ఎలా అన్నది ట్రైబ్యునల్​ నిర్ధరించాల్సి ఉంది.  ట్రైబ్యునల్​ ఎదుట వాదనలకు భారీగా ఖర్చవుతుంది. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్​ రెండున్నర రెట్లు ఎక్కువగా ఖర్చు చేసింది. బచావత్​ ట్రైబ్యునల్ ​లోనే అన్యాయం జరిగిందని... సవరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేసు వేసింది తెలంగాణ.


వీటన్నింటిపై చర్చించుకొని రెండు రాష్ట్రాలు ఓ అంగీకారానికి వచ్చి విషయాన్ని రాతపూర్వకంగా తెలియజేస్తే అదే ట్రైబ్యునల్​ తీర్పులోనూ వచ్చే అవకాశం ఉంది.  కృష్ణా, గోదావరి బోర్డుల పనితీరు, అసలు ఈ బోర్డుల అవసరం ఉందా అనే అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: