అక్రమ నిర్మాణాలను కూల్చేయాలన్న జగన్మోహన్ రెడ్డి నిర్ణయంపై తమ్ముళ్ళు ఎందుకింతగా గోల చేస్తున్నారో తెలుసా ? వాళ్ళ గోలంతా ప్రజావేదికను కూల్చేయటంపై కానే కాదట. కూల్చివేతలంటు మొదలైతే అది ప్రజావేదికతోనే ఆగదన్నదే తమ్ముళ్ళ గోల.

 

నిజానికి ప్రజావేదికను కూల్చేయటం వల్ల టిడిపికి వచ్చిన నష్టం కూడా ఏమీలేదు. ఎందుకంటే అదేమీ చంద్రబాబునాయుడు సొంత డబ్బులతో కట్టుకున్నదేమీ కాదు. అయినా కానీ జగన్ నిర్ణయంపై చంద్రబాబు అండ్ కో ఎందుకంతగా మండిపోతున్నారు ? ఎందుకంత గోల చేస్తున్నట్లు ?

 

ఎందుకంటే ప్రజావేదిక కూల్చివేత తర్వాత జగన్ తదుపరి టార్గెట్ చంద్రబాబు ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కూల్చివేతే అని అర్ధమైపోయింది తమ్ముళ్ళకు. లింగమనేని గెస్ట్ హౌస్ కూడా అక్రమ కట్టడమే. కరకట్ట మీద లింగమనేని గెస్ట్ హౌస్ తో పాటు బడాబాబుల విలాసవంతమైన భవనాలు చాలానే ఉన్నాయి.

 

లింగమనేని భవనంతో పాటు  మిగిలిన అక్రమనిర్మాణాల కూల్చివేతకు చంద్రబాబు సిఎంగా ఉన్నపుడే నోటీసులు కూడా ఇచ్చారు. అయితే తర్వాత లింగమనేని గెస్ట్ హౌస్ పై చంద్రబాబు మనసు పారేసుకోవటంతో కూల్చివేతల విషయం అటకెక్కింది.

 

ఎప్పుడైతే లింగమనేని గెస్ట్ హౌస్ చంద్రబాబు క్యాంపాఫీసు అయిపోయిందో వెంటనే దాని రూపురేఖలు మారిపోయాయి. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గెస్ట్ హౌస్ షోకులకు ఖర్చు చేశారు. ప్రజావేదికను కూల్చేస్తే వెంటనే చంద్రబాబు ఉంటున్న భవనం కూల్చివేతకు కూడా ప్రభుత్వం రెడీ అయిపోతుందని చంద్రబాబు అండ్ కోలో టెన్షన్ పెరిగిపోతోంది. తానుంటున్న భవనాన్ని కూలగొట్టకుండా ముందుజాగ్రత్తగా తమ్ముళ్ళతో ప్రజావేదికపై గోల చేయిస్తున్నట్లు అర్ధమైపోతోంది. అర్ధమైందా తమ్ముళ్ళ గోల వెనుక అసలు కథేంటో ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: