జగన్ చెప్పినట్టుగానే ప్రజా వేదికను కూల్చే ప్రాసెస్ రాత్రి అధికారులు మొదలు పెట్టారు. తరలించడానికి వీలున్న సామాగ్రిని తొలుత వాహనాల్లో తరలించిన అధికారులు, ఆ తర్వాత ఒక్కొక్కటిగా కూల్చివేతలు మొదలు పెట్టారు. ప్రహరీని మొదలుకొని, మొత్తంగా కట్టడాన్ని నేలమల్టం చేసే దిశగా అధికారులు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. రాత్రికి రాత్రే మొత్తంగా ప్రజా వేదిక కూల్చివేత పూర్తయిపోతుందని పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. అయితే, కూల్చివేత మొదలు పెట్టామనీ, ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని అధికారులు అంటున్నారు. 


కృష్ణా నదికి ఆనుకుని వున్న లింగమనేని గెస్ట్‌ హౌస్‌ని చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అద్దెకు తీసుకున్న విషయం విదితమే. ముఖ్యమంత్రిగా దాన్నే అధికారిక నివాసంగా చేసుకున్నారు చంద్రబాబు. ఆ తర్వాత, తన నివాసానికి పక్కనే ప్రజా వేదికను ప్రభుత్వ ధనంతో నిర్మించి.. అక్కడి నుంచి అధికారిక కార్యక్రమాలు చేపట్టారు. అయితే, ఈ నిర్మాణం కోసం అడ్గగోలుగా ఖర్చు చేశారంటూ అప్పట్లోనే వైఎస్సార్సీపీ ఆరోపించింది.


ప్రజా వేదికతోపాటు, చంద్రబాబు నివాసమూ అక్రమ కట్టడమేనంటూ న్యాయస్థానాన్ని సైతం వైసీపీ ఆశ్రయించిన విషయం విదితమే. ప్రజా వేదిక అక్రమ నిర్మాణం.. అని గతంలో తాము చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి వున్నామంటూ, వైఎస్‌ జగన్‌.. ముఖ్యమంత్రి హోదాలో ప్రజా వేదిక కూల్చివేతకు ఆదేశాలు ఇవ్వడం.. ఆ కూల్చివేత ప్రారంభమవడం.. అన్నీ చకచకా జరిగిపోయాయ్‌.  విదేశాల నుంచి తిరిగొస్తున్న చంద్రబాబు, ప్రజా వేదిక విషయంలో చేయబోయే గగ్గోలు ఎలా వుంటుందో మరి.!  

మరింత సమాచారం తెలుసుకోండి: