చంద్రబాబునాయుడును మాజీ మంత్రి
గంటా శ్రీనివాసరావు బాగా టెన్షన్ పెట్టేస్తున్నారు. విశాఖపట్నం ఉత్తర
నియోజకవర్గంలో గెలిచిన గంటా మంగళవారం ముఖ్య మద్దతుదారులతో సమావేశమయ్యారు. దాంతో
పార్టీలో టెన్షన్ పెరిగిపోతోంది. మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమితో ఎవరు
టిడిపిలో ఉంటారు ? ఎవరు వెళిపోతారు ? అన్న విషయంలో చంద్రబాబుకు క్లారిటి లేక
అవస్తలు పడుతున్నారు.
ఇటువంటి సమయంలోనే గంటా వ్యవహారం పార్టీని బాగా ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. మొన్ననే నలుగురు రాజ్యసభ ఎంపిలు బిజెపిలోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. అఫ్ కోర్స్ వాళ్ళంతా చంద్రబాబు అనుమతితోనే ఫిరాయించారనే ప్రచారం కూడా ఉందనుకోండి అది వేరే సంగతి. వాళ్ళు ఫిరాయించకముందు నుండి గంటా పేరు ప్రచారంలో ఉంది.
కాకపోతే గంటా టిడిపిని వదిలేసి వైసిపిలోకి వెళ్ళబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గంటాను చేర్చుకోవటానికి జగన్మోహన్ రెడ్డి సుముఖంగా లేరని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలోనే వేరేదారి లేక గంటా బిజెపిలోకి వెళ్ళిపోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది.
అయితే గంటా టిడిపిని వదలటం ఖాయమైతే ఒక్కరే వెళ్ళరని మరికొందరు ఎంఎల్ఏలను తీసుకునే వెళతారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అదే నిజమైతే చంద్రబాబుకు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా మాయమైపోతుందేమో. దాంతో గంటాతో పాటు పార్టీని వీడిపోయే వాళ్ళెవరు ? అన్న విషయంలో చంద్రబాబు లెక్కలేసుకుంటున్నారు.
తన మద్దతుదారులతో గంటా కీలక సమావేశం పెట్టుకున్నారు. మామూలు సమావేశమే అని పైకి చెబుతున్నా ఎవరూ దాన్ని నమ్మటం లేదు. ఎందుకంటే గంటా పార్టీ మారిపోవటం ఖాయమని గంటా మద్దతుదారులే చెబుతున్నారు కాబట్టి. ఏదేమైనా గంటా వ్యవహారంతో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోందన్నది మాత్రం ఖాయం.