కేఏ పాల్...పరిచయం అవసరం లేని పేరు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు. గత ఏపీ ఎన్నికల్లో చేసిన హడావుడి ఆంతా ఇంతా కాదు. అన్ని పార్టీలను మట్టి కరిపిస్తానని పాల్ శపథం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో సంచలనం సృష్టించబోతున్నామంటూ మీడియాలో హడావిడి చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్కు గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఆయన చేష్టలు, మాటల ద్వారా జనం బాగా ఎంటర్టైన్ అయ్యారు. ఎన్నికల సమయంలో పాల్ ఏం చేసినా అది వైరల్గా మారిపోయింది. అది ఆయనకు ఎన్నో కొన్ని ఓట్లు తెచ్చిపెట్టకపోదా? అనే చర్చ సాగింది. కానీ, ఇవేవీ ఆయనకు ఓట్ల వర్షం కురిపించలేదు. ప్రజల దృష్టిని ఆకర్షించకపోయినప్పటికీ...సినిమా వాళ్ళ కన్ను ఆయన మీద పడింది. ఆయన బయోపిక్ తీసే ఆలోచనలో ఒక కొత్త దర్శకుడు ఉన్నారట.
కేఏ పాల్ అధ్యక్షుడిగా ఉన్న ప్రజాశాంతి పార్టీ తరఫున అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి రాష్ట్రంలో ఒక్కచోటా డిపాజిట్టు దక్కపోగా...ఎక్కడా చెప్పుకోదగ్గ ఓట్లు రాలేదు. అసెంబ్లీ స్థానాల్లో కనీసం ఎక్కడా 300కు మించి ఓట్లు రాలేదు. ఇక పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసిన కేఏ పాల్కు వచ్చింది 281 ఓట్లు మాత్రమే. నర్సాపురం లోక్సభ స్థానంలో ఆయనకు 2987 ఓట్లు దక్కాయి. ప్రజాశాంతి పార్టీ చిహ్నమైన హెలీకాఫ్టర్ గుర్తు తమ పార్టీకి చెందిన ఫ్యాన్ గుర్తును పోలి ఉందని వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయటంతో కొత్త చర్చజరగగా... మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లు కలిగిన అభ్యర్థులే ప్రజాశాంతి పార్టీ తరఫున బరిలో ఉన్నప్పటికీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. నామినేషన్ వేసినా.. ప్రచారం చేసినా.. చివరకు ఓటు వేసినా.. తన చేష్టలతో వార్తల్లో నిలిచిన కేఏ పాల్... చివరకు ఓడిపోయి కూడా వార్తల్లో నిలిచారు. అనంతరం ఆయన తెరమరుగు అయ్యారు.
అయితే, కేఏ పాల్ సొంతం చేసుకున్న క్రేజ్ను సినీ పరిశ్రమ ఆకర్షించింది. ఆయన పేరుతో బయోపిక్కు రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది. ప్రముఖ నటుడు పాల్ పాత్రను ప్రముఖ నటుడు సునీల్ చేయనున్నారని, ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. అయితే ఆ వార్తపై ఇంకా అధికారిక కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది. పాల్ బయోపిక్ కమర్సియల్గా అలరించనుందా? ఆయనలాగే నవ్వులు పంచనుందా? అనేది తెలియాలంటే...ఇంకొద్ది కాలం వేచిచూడాల్సిందే.