గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఊహించని దూకుడుతో ముందుకు సాగుతోంది. వివిధ అంశాల్లో ప్రజల నుంచి ప్రశంసలు, ఆగ్రహాలు ఎదుర్కుంటున్న జీహెచ్ఎంసీ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పరిశుభ్రతనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న జీహెచ్ఎంసీ రోడ్లపై ఎక్కడ పడితే చెత్త వేసినా , ఎక్కడ బడితే అక్కడ ఉమ్మినా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా, తాజాగా ఆర్టీసీ బస్సు డ్రైవర్కి జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. రోడ్డుపై ఉమ్మి వేసినందుకు జరిమానా విధించారు.
అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ఉదంతం వివరాల్లోకి వెళితే....కుషాయిగూడ బస్ డిపోకు చెందిన డ్రైవర్ జగదీష్ విధి నిర్వహణలో ఉన్న సమయంలో బస్సులో కూర్చొని రోడ్డుపై ఉమ్మి వేశాడు. దీంతో అప్పుడే రోడ్లను పరిశుభ్రం చేసిన జీహెచ్ఎంసీ కార్మికులు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.వెంటనే ఈ విషయంపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు డ్రైవర్ జగదీష్కు జరిమానా విధించారు. ఆ సమయంలో బస్సు డ్రైవర్ లింగంపల్లిలో ఉన్నాడని తెలుసుకున్న అధికారులు అక్కడికి వెళ్లి మరీ జరిమానా విధించడం గమనార్హం. వంద రూపాయల జరిమానా చెల్లించాలని ఆయన దగ్గర నుంచి వసూలు చేశారు.
మరోవైపు హైదరాబాదులోని వేంకటాద్రి నగర్ కాలనీకి చెందిన రవీందర్ రెడ్డి అనే వ్యక్తి రోడ్డుపై చెత్త వేసాడని అతనికి ముప్పై వేల రూపాయల జరిమానా విధించారు. పబ్లిక్ స్మోకింగ్ విషయంలోనూ జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు పోలీసులతో డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. ఎవరైనా ఇక నుంచి రోడ్డుపై చెత్త వేస్తే భారీ జరిమానాలు విధిస్తోంది. ఇప్పటివరకు ఇలాంటి చర్యలు కాగితాల వరకే ఉండగా..ఇప్పుడు నిజం చేసి చూపిస్తున్నారు. మంగళవారం రోడ్డుపై చెత్త వేసిన ఇద్దరికి రూ.40 వేలు ఫైన్ వేశారు. చందానగర్ వెంకటాద్రి కాలనీకి చెందిన రవీందర్ రెడ్డికి మంగళవారం భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్డుపై వేసినందుకు రూ. 30 వేల ఫైన్ వేశారు. ఆయనతో పాటు రోడ్డుపై చెత్త వేశాడని.. డస్ట్ బిన్ లను కూడా ఏర్పాటు చేసుకోకపోవడంతో మూసాపేటలోని సాయి బాలాజీ వైన్స్ కు రూ. 10 వేల ఫైన్ వేశారు. రోడ్లపై ఉమ్మినా, చెత్త వేసినా ఫైన్ కట్టాల్సిందేనని చెప్పారు GHMC అధికారులు. అయితే, ఈ చర్యలను మరింత వేగవంతం చేయాల్సి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.