ప్రభుత్వంలో రెవిన్యూ డిపార్ట్మెంట్ చాలా ముఖమైనది మరియు అవినీతిమైనది.  గ్రామస్థాయిలో వీఆర్వోల నుంచి, జిల్లా స్థాయిలో డీఆర్వో వరకు వారిదే హవా. రెవెన్యూ ఉద్యోగులు సహకరిస్తేనే పాలన సక్రమంగా సాగుతుంది, వారు మొండికేస్తే ఏ పథకమూ సక్రమంగా అమలయ్యే ప్రసక్తేలేదు. అవినీతి ఆరోపణలు కూడా రెవెన్యూ వ్యవస్థపైనే ఎక్కువగా వస్తుంటాయి. పట్టాలు, పాస్ పుస్తకాల విషయంలో వారు చెప్పిందే వేదం, గీసిందే గీత.


దీన్ని కాస్త నివారించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నం చేసి భంగపడ్డారు. రెవెన్యూ ఉద్యోగులను వివిధ విభాగాల్లో కలిపేసి, వారి విధుల్ని మిగతా వారికి పంచేసి.. అవినీతిని ప్రక్షాళన చేస్తానంటూ ముందుకు కదిలినా ఏదీ జరగలేదు. అలా ముక్కుసూటిగా వెళ్లాలంటే కష్టమే, కానీ జగన్ మాత్రం చాలా తెలివిగా రెవెన్యూ వ్యవస్థలో ప్రక్షాళన మొదలుపెట్టారు. గ్రామ సచివాలయంతో వారి అధికారాలకు కత్తెర వేస్తూ, గ్రామ వాలంటీర్ల వ్యవస్థతో పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తున్నారు.


నిరుద్యోగ సమస్య నిర్మూలించడం, పథకాలను ప్రతి ఒక్కరి దగ్గరకు తీసుకెళ్లడం అనే ప్రయోజనాలు బైటకు కనిపిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం రెవెన్యూ వ్యవస్థ నియంతృత్వాన్ని నియంత్రించడానికే గ్రామ సచివాలయాల కాన్సెప్ట్ వచ్చిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలు ఏర్పడతాయి.  వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, ఎంపీఈవో, లైన్ మెన్.. ఇలా అప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారే కాకుండా కొత్తగా డిజిటల్ సహాయకులు, గ్రామీణ ఇంజినీరు.. వంటి పోస్టులు భర్తీ కాబోతున్నాయి. గ్రామ సచివాలయాల ఏర్పాటుతో ఇప్పటివరకూ పవర్ సెంటర్లుగా ఉన్న తహశీల్దార్ కార్యాలయాల హవా తగ్గుతుంది. కేవలం రెవెన్యూ శాఖతోనే కాకుండా.. ఇతర శాఖల ఉద్యోగులతో కలసి వీఆర్వోలు పనిచేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: