కాంగ్రెస్ పార్టీకి 150 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. భారత దేశాన్ని ఎక్కువ ఏళ్ళు పరిపాలించిన పార్టీ కూడా కాంగ్రెస్స్. అయితే ఇప్పుడు అదే పార్టీ ఆర్ధిక సంక్షోభంలో ఉందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలకు కేటాయించిన బడ్జెట్ లో భారీ కోత పెట్టారు. ఆయా సంఘాలకు కేటాయించే బడ్జెట్ ను తగ్గించనున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత తాత్కాలిక ప్రాతిపదికపైన నియమించుకున్న సిబ్బందిని తొలగించిన కాంగ్రెస్.. పార్టీ కోసం పని చేసే వారికి ఇచ్చే జీతాల్లోనూ కోత విధించారు.
కొన్ని విభాగాల్లో నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవటంతో పలువురు ఉద్యోగులు పార్టీని విడిచి పెట్టి వెళ్లిపోతున్నారు. సోషల్ మీడియా విభాగంలో మొత్తం 55 మంది ఉండగా.. ప్రస్తుతం 35 మంది మాత్రమే ఉన్నారు. మరో 20 మంది రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయారు. ఉన్న వారికి కూడా జీతాలు చాలా ఆలస్యంగా ఇస్తున్న పరిస్థితి. పార్టీలోని మీడియా విభాగానికి సంబంధించి కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది.
డేటా విశ్లేషణ.. డేటా ఇంటెలిజెన్స్ విభాగాలను ఎత్తేయాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో మాదిరి సీనియర్ నేతల్ని అదే పనిగా ప్రయాణాలు పెట్టుకోవద్దని.. ఒకవేళ టూర్లకు వెళ్లినా సొంత ఖర్చుల మీదే వెళ్లాలని పార్టీ స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో పని చేస్తున్న చాలామందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంతటి ఆర్థిక సంక్షోభం ఆ పార్టీ ఎప్పుడూ చూడలేదన్న మాట వినిపిస్తోంది. ఎలాంటి పార్టీ ఎలా అయిపోయిందన్న మాట పలువురి నోటి నుంచి రావటం గమనార్హం.