తెలుగుదేశం పార్టీ నేతల విమర్శ పర్వం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు పరస్పరం విమర్శలు చేసుకోవడం, పార్టీ పరువును రోడ్డున పడేయడం అనేది సహజంగానే తెరమీదకు వస్తోంది. గత కొంతకాలంగా అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తాజాగా టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్ చేశారు. ``నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు, నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేని వాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్ చేస్తున్నాడు... ఇది మన దౌర్భాగ్యం`` అంటూ కామెంట్ చేయడగా బుద్ధా సైతం అంతే ఘాటుగా రియాక్టయ్యారు. అయితే, ఇందులోకి చంద్రబాబును లాగడం చర్చనీయాంశంగా మారింది.
చాలారోజుల నుంచి బుద్ధా వెంకన్నకు, కేశినేని నాని మధ్య విభేదాలు ఉన్నాయి. కొద్దిరోజుల నుంచి బుద్ధా వెంకన్న ట్వీటర్లో యాక్టివ్గా ఉన్న విషయం తెలిసిందే. ఆయన కొత్తగా ట్వీట్స్ పెడుతున్న నేపథ్యంలో కేశినేని నాని టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేశినేని నాని టార్గెట్ చేయడంతో, బుద్ధా వెంకన్న సైతం ఘాటుగా రిప్లై ఇచ్చారు. ``నీకు ఏం చేయాలో తెలియక అబద్ధాలు ఆడుతున్నావు...ప్రజారాజ్యం నుంచి బయటకి వచ్చే ముందు ఆడిన ఆటలు ఈ పార్టీలో సాగవు`` అంటూ ఓ ట్వీట్లో కామెంటట్ చేశారు. మరో ట్వీట్లో ``చిరంజీవి నీకు రాజకీయ జన్మనిస్తే చిరంజీవిని అనరాని మాటలని చిరంజీవి పార్టీని కూల్చావు..చంద్రబాబు నీకు రాజకీయ పునర్జన్మ ఇస్తే ఇవాళ చంద్రబాబు గురించి శల్యుడులా మాట్లాడుతున్నావు. విజయసాయి రెడ్డి మీద నేను పోరాడుతున్నానో నువ్వు పోరాడుతున్నావో ప్రజలకు తెలుసు`` అంటూ ఓ కామెంట్ చేశారు.
``సంక్షోభం సమయంలో పార్టీ కొసం నాయకుడి కొసం పొరాడెవాడు కావాలి....ఇతర పార్టీ నాయకులతొ కలిసి కూల్చెవాడు ప్రమాదకరం....నీ లాగా అవకాసవాదులు కాదు...చనిపొయెవరకు చంద్రబాబు కొసం సైనికుడిలా పొరాడేవాడు కావాలి`` అని ఇంకో ట్వీట్లో టార్గెట్ చేశారు. ``దళిత నాయకుడు మాజీ స్పీకర్ బాలయోగి ఆస్తులన్నీ కాజేసిన దొంగ ఎవరో దేశం మొత్తానికి తెలుసు. ఒకే నంబర్పై దొంగ పర్మిట్లతో బస్సులు నడిపిన దొంగవి నువ్వే కదా? నేను చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయి వినే ధైర్యం నీకుందా?`` అంటూ ఇంకో ట్వీట్లో విరుచుకుపడ్డారు. ``నువ్వు చేసినవన్నీ అభాంఢాలు, నేను చెప్పేవన్నీ నిజాలు. బస్సుల మీద ఫైనాన్స్ తీసుకొని 1997లో సొంతంగా దొంగ రిసిప్ట్ లు తయారుచేసుకుని ఫైనాన్స్ వారికి డబ్బులు చెల్లించకుండా నువ్వే దొంగ ముద్ర వేసుకొని కోట్లాది రూపాయలకు ఫైనాన్స్ కంపెనీలకు cheet చేసిన నువ్వా Tweet చేసేది`` అని ప్రశ్నించారు. కేశినేని నాని పేరు పెట్టకుండానే ఆయన్ను బుద్ధా వెంకన్న టార్గెట్ చేయడం, ఏకంగా చిరంజీవితో పోలుస్తూ, చంద్రబాబును ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది.