పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంజీవిని అని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్ట్ అనుమతులు తీసుకొచ్చారని తెలిపారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాల్వ మీద పట్టిసీమ కట్టి రూ.350కోట్లు దోచేశారని ఆరోపించారు.
లక్షా 6వేల కుటుంబాలను ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద తరలించాల్సి ఉందని అన్నారు. వైఎస్సార్ కాల్వలు తవ్వకపోతే భూసేకరణకు వేలకోట్ల రూపాయల అదనపు భారం పడేదన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారన్నారు. పోలవరం దగ్గర ఫొటోలు తీసుకోవటం తప్ప, గత ప్రభుత్వానికి ప్రాజెక్ట్ పూర్తి చేద్దామన్న ధ్యాసే లేదని అన్నారు.
ముంపునకు గురయ్యే లక్షలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోలేదన్నారు. ప్రాజెక్ట్ వ్యయం అంచనా పెంచుకుంటూ పోవడమే తప్ప, టీడీపీ ప్రభుత్వం చేసిందేమీలేదన్నారు.