సినీ నటిగా తన సత్తాను చాటుకున్న జయప్రద రాజకీయాల్లోకి వచ్చి అక్కడ కూడా సక్సెస్ అయ్యారు. అన్న నందమూరి పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆమె తరువాత ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యురాలిగా గెలిచారు. ఇక జయప్రద ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ తరఫున రెండు సార్లు రాంపూర్ నుంచి లోక్ సభకు నెగ్గారు.
తాజా ఎన్నికల్లో ఆమె బీజేపీ తరఫున రాంపూర్ లోక్ సభకు పోటీ చేసి ఎస్పీ చేతిలో ఓడిపొయారు. ఇపుడు యూపీలో బీజేపీ సర్కార్ ఉంది. దాంతో రాంపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆమెను అసెంబ్లీ నుంచి నిలిపేందుకు ఆ పార్టీ రెడీ అయింది. మరో వైపు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి, మాజీ ఎంపీ డింపుల్ యాదవ్ ఈ ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఎస్పీకి కంచుకోటయిన రాంపూర్లో డింపుల్ అయితేనే గెలుపొందే అవకాశం ఉందని, ఆ పార్టీ స్థానిక నేతలు అధిష్టానం దృష్టికి తీసుకువచ్చినట్లు ఎస్పీ సీనియర్ నేత వెల్లడించారు.
అయితే బీజేపీ నుంచి ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదను బరిలో నిలిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో ఆమెనే నిలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆమె ఇప్పటికే పార్టీ పెద్దలతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఇద్దరు సీనియర్ నేతలు పోటీ పడే అవకాశం ఉండడంతో రాంపూర్ ఉప ఎన్నిక ఉత్కంఠగా మారింది. త్వరలోనే ఈ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. మరి జయప్రదంగా యూపీ అసెంబ్లీలో అడుగుపెట్టి మంత్రి పదవి జయప్రద కొట్టేస్తుందా అన్నది చూడాలి.
ఇదిలావుండగా.. లోక్సభ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన ఎస్పీ, బీఎస్పీలు ఫలితాల అనంతరం ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. దీంతో ఇక జరగబోయే ప్రతి ఎన్నికల్లోనూ తాము ఒంటరిగా బరిలోకి దిగుతామని బీఎస్పీ చీఫ్ మాయావతి ప్రకటించారు. అయితే డింపుల్ను బరిలోకి దింపితే.. బీఎస్పీ మద్దతు ఇస్తుందా లేదా అనేది ఎస్పీ నేతలను వెంటాడుతున్న ప్రశ్న. 1980 నుంచి ఇప్పటి వరకు ఈ స్థానంలో ఎస్పీ తప్ప మరో పార్టీకి గెలిచే అవకాశం రాలేదు. ఈసారి బీజేపీ ఇక్కడ విజయం సాధించాలని ముమ్మర ప్రయత్నాలను చేస్తోంది. అందుకే లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే జయప్రద రాంపూర్ స్థానిక నేతలతో చర్చలను ప్రారంభించారు.